విజయ్ దేవరకొండ హీరోగా ‘లైగర్’ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు పూరి జగన్నాథ్..తన తదుపరి చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు. గత సినిమా చేదు ఫలితంతో ఆయన వెంటనే కొత్త ప్రాజెక్ట్ వెల్లడించలేకపోతున్నారు. ఈ క్రమంలో పూరి జగన్నాథ్ రవితేజ, చిరంజీవి, సల్మాన్ఖాన్ వంటి హీరోలతో తన తదుపరి సినిమా రూపొందిస్తాడనే వార్తలొచ్చాయి. అయితే ఇవేమీ సెట్స్ మీదకు వెళ్లలేదు. ఇక తాజాగా పూరి కొత్త సినిమా గురించి మరో టాక్ వినిపిస్తున్నది. బాలకృష్ణతో ఈ దర్శకుడు సినిమా చేయబోతున్నాడట. ఇప్పటికే వీరి కాంబినేషన్లో ‘పైసా వసూల్’ సినిమా తెరకెక్కింది.
మాస్ ఆడియెన్స్, అభిమానులను ఆ సినిమా మెప్పించింది. హీరోలతో సరదాగా కలిసిపోయే పూరి…ఈ సినిమా చిత్రీకరణ సందర్భంగా బాలకృష్ణకూ సన్నిహితుడయ్యారు. దీంతో వీరు మరో సినిమా చేయాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మూవీ ఉంటుందని తెలుస్తున్నది.