హిందీ చిత్రసీమలో పదేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది పంజాబీ సుందరి తాప్సీ. ‘ఛష్మే బద్దూర్’ చిత్రంతో బాలీవుడ్లో అరంగేట్రం చేసిన ఈ భామ పదేళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నానని చెప్పింది. కథల ఎంపికలో తీసుకున్న కొన్ని గొప్ప నిర్ణయాలు సత్ఫలితాలనిచ్చాయని సంతోషం వ్యక్తం చేసింది. ఇప్పుడు తాను కోరుకున్న స్థానంలో ఉన్నానని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేసింది.
తాప్సీ మాట్లాడుతూ ‘బాలీవుడ్లోకి రాకముందు దక్షిణాదిన కొన్ని చిత్రాల్లో నటించా. వాటి ద్వారా స్టార్డమ్ వచ్చింది కానీ నటిగా సంతృప్తి దొరకలేదు. ప్రయోగాత్మక చిత్రాల కోసం బాలీవుడ్ వైపు దృష్టి పెట్టా. ‘పింక్’ చిత్రం నా కెరీర్లో గొప్ప మలుపు. అక్కడి నుంచి నాదైన పంథాలో సాగిపోతున్నా’ అని పేర్కొంది. ప్రస్తుతం తాప్సీ హిందీలో షారుఖ్ఖాన్ సరసన ‘డంకీ’ చిత్రంలో నటిస్తున్నది. తమిళంలో జనగణమన, ఏలియన్ చిత్రాలతో బిజీగా ఉంది.