బెంగళూరు: అభిమానులంతా ప్రేమగా ‘అప్పూ’ అని పిలుచుకునే కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్.. మరణానంతరం కూడా తన పెద్దమనసు చాటుకున్నారు. నలుగురి జీవితాల్లో రంగులు నింపారు. ఆయన దానం చేసిన కళ్లతో నలుగురికి కంటిచూపు దక్కిందని బెంగళూరులోని నారాయణ నేత్రాలయ వైద్యులు చెప్పారు. గుండుపోటుతో కొన్నిరోజుల క్రితం పునీత్ రాజ్కుమార్ కన్నుమూసిన సంగతి తెలిసిందే.
1994లో పునీత్ తండ్రి, కన్నడ కంఠీరవ రాజ్కుమార్ కూడా మరణానంతరం తమ కుటుంబ సభ్యులు నేత్రదానం చేస్తారని ప్రకటించారు. ఆయన మాట ప్రకారమే 2006లో మరణానంతరం రాజ్కుమార్ కళ్లు దానం చేశారు. ఆ తర్వాత 2017లో పునీత్ తల్లి పార్వతమ్మ కళ్లను కూడా దానం చేశారు. వారి అడుగుజాడల్లోనే నడిచిన కుటుంబం పునీత్ నేత్రాలను కూడా దానం చేసింది.
ఈ కళ్లతో నలుగురికి చూపు దక్కిందని వైద్యులు చెప్తున్నారు. సాధారణంగా ఇలా దానం చేసిన కళ్లను ఇతరులకు ట్రాన్స్ప్లాంట్ చేస్తామని, అంటే ఒక వ్యక్తి కళ్లతో మహా అయితే ఇద్దరికి మాత్రమే చూపు దక్కుతుందని ఒక డాక్టర్ చెప్పారు. అయితే పునీత్ కళ్లతో మాత్రం మొత్తం నలుగురికి చూపు దక్కిందని, కార్నియాలను వేరు చేసి నలుగురికి శస్త్రచికిత్స చేశామని వైద్యులు వివరించారు.
కర్ణాటకకు చెందిన ఒక మహిళ, ముగ్గురు పురుషులకు ఈ శస్త్రచికిత్సల ద్వారా కంటిచూపు దక్కిందని తెలియజేశారు. కాగా,శుక్రవారం ఉదయం తన జిమ్లో వర్కవుట్ చేస్తున్న సమయంలో పునీత్కు ఛాతీనొప్పి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నొప్పుతో కుప్పకూలిన ఆయన్ను వెంటనే బెంళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. కానీ ఆ తర్వాత కాసేపటికే పునీత్ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.