Puli Seetha | మెగాస్టార్ చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని ఎన్నో సందర్భాల్లో వ్యక్తం చేసిన నటి పులి సీత ఎట్టకేలకు తన కలను నిజం చేసుకుంది. చిన్నప్పటి నుంచి ఆరాధిస్తున్న చిరంజీవిని ఒకసారి అయినా కలవాలనే ఆమె కోరిక తాజాగా నెరవేరింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భావోద్వేగానికి గురైన పులి సీతను స్వయంగా చిరంజీవి తన ఇంటికి ఆహ్వానించి కలవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.రీల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న పులి సీత మెగా ఫ్యామిలీకి వీరాభిమాని. ముఖ్యంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్లపై తనకున్న అభిమానాన్ని ఆమె తరచూ సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తుంటారు. మెగా కుటుంబంపై ఎవరైనా విమర్శలు చేసినా, రాజకీయంగా పవన్ కళ్యాణ్పై కామెంట్లు వచ్చినా వెంటనే స్పందిస్తూ వీడియోలు కూడా చేస్తుంటారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పులి సీత, “తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం దొరికినా చిరంజీవిని కలవడం అంత సులభం కాదు” అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. సినీ ఇండస్ట్రీకి వచ్చి పదకొండేళ్లు దాటినా తన అభిమాన హీరోను కలిసే అవకాశం రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడి కోరికను కూడా తీర్చలేకపోయానని ఎమోషనల్ అయ్యారు. గతంలో ఎన్నోసార్లు ప్రయత్నించినా చిరంజీవిని కలిసే అవకాశం దక్కలేదని, ఆయన దగ్గర ఉన్నవారు తనకు సహకరించలేదని కూడా ఆమె పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు పలు మీడియా వేదికల్లో కూడా చర్చనీయాంశంగా మారాయి.
ఈ విషయం మెగాస్టార్ చిరంజీవి దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించినట్లు తెలుస్తోంది. తన టీమ్ ద్వారా పులి సీతను సంప్రదించి, ఇంటికి ఆహ్వానించారు. మంగళవారం ఆమె చిరంజీవిని ఆయన నివాసంలో కలిసి తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా పులి సీత తన అభిమాన హీరోకు ప్రత్యేక బహుమతిని అందించారు. చిరంజీవి ఆరాధ్య దైవమైన ఆంజనేయస్వామి చిత్రంతో కూడిన ఒక ప్రత్యేక ఫోటో ఫ్రేమ్ను ఆమె కానుకగా ఇచ్చారు. ఆ బహుమతిని చూసిన చిరంజీవి ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.గిఫ్ట్ విలువ దాని ధరలో ఉండదు. దాన్ని ఇచ్చే వ్యక్తి ప్రేమ, అభిమానంలో ఉంటుంది. నాకు ఎంతో ఇష్టమైన హనుమంతుడి ఫోటోను ఇవ్వడం చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఇది నా హృదయానికి దగ్గరైన బహుమతి” అంటూ చిరంజీవి పులి సీతను అభినందించారు.
చిరంజీవిని కలిసిన అనంతరం పులి సీత ఆ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. చిన్నప్పటి నుంచి ఆరాధించిన వ్యక్తిని కలవడం జీవితంలో మరచిపోలేని అనుభూతిగా పేర్కొన్నారు. “చిరంజీవి గారు ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. ఇది నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. నిజమైన అభిమానానికి భగవంతుడు తప్పకుండా ఫలితం ఇస్తాడని ఇప్పుడు అర్థమైంది” అని ఆమె పేర్కొన్నారు.