“దీవాన’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్నది. ఈ కథలోని ఇంటర్వెల్, ద్వితీయార్థం బాగా నచ్చి నిర్మాణానికి ఉపక్రమించాం. ‘ఏ’ సర్టిఫికెట్ వల్ల మా సినిమాకు కుటుంబ ప్రేక్షకులు రాలేకపోతున్నారు. ఒక మంచి సినిమా అందరికీ చేరువ కాలేకపోతున్నదనే బాధ మాలో ఉన్నది’ అని అన్నారు నిర్మాతలు వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి. వారిద్దరూ కలిసి నిర్మించిన చిత్రం ‘దీవాన’. హర్షిత్రెడ్డి, స్మేహా మణిమేగలై హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకుడు. శనివారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మంగళవారం హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. ‘ఇంటర్వెల్ ట్విస్ట్ తర్వాత మరింత బలమైన కథ, కథనాలతో ముందుకు సాగే సినిమా ఇది.
ఈ సినిమాకు మేం డబ్బులు పెట్టడం దగ్గరే ఆగిపోలేదు. క్రియేటివ్గా కూడా ఇన్వాల్వ్ అయ్యాం. గతంలో మల్టీపుల్ ప్రాజెక్ట్స్కి వర్క్ చేసిన మేం, ఈ సారి ఈ ఒక్క సినిమాపైనే దృష్టి పెట్టాం. కంటెంట్ పరంగానే కాదు, ఆర్థికంగా కూడా మాకు సంతృప్తినిచ్చిన సినిమా ‘దీవాన” అని నిర్మాతలు చెప్పారు. ప్రేమ, స్నేహం, కుటుంబ భావోద్వేగాల సమ్మేళనమే ఈ సినిమా అని, చూసినవారంతా సకుటుంబంగా చూడదగ్గ సినిమా అని మెచ్చుకుంటున్నారని, పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో డే బై డే వసూళ్లు పెరుగుతున్నాయని, వచ్చే వారం సినిమా మరింత పికప్ అవుతుందని నమ్ముతున్నామని నిర్మాతలు ఆశాభావం వెలిబుచ్చారు.