‘కోల్కతా బ్యాక్డ్రాప్లో సాగే పీరియాడికల్ చిత్రమిది. 1970 కాలం నాటి కథాంశంతో నవ్యానుభూతిని పంచుతుంది’ అని అన్నారు వెంకట్ బోయనపల్లి. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘శ్యామ్సింగరాయ్’. నాని, సాయిపల్లవి, కృతిశెట్టి నాయకానాయికలుగా నటించారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు. ఈ నెల 24న విడుదలకానుంది. శనివారం హైదరాబాద్లో వెంకట్ బోయనపల్లి పాత్రికేయులతో ముచ్చటించారు.
టాలీవుడ్తో నాకు పన్నెండేళ్లుగా అనుబంధముంది. గతంలో ఇతరుల భాగస్వామ్యంలో కొన్ని చిత్రాల్ని నిర్మించా. సోలో ప్రొడ్యూసర్గా ఇదే నా మొదటి చిత్రం. అద్భుతమైన ప్రేమకథతో దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ఈ సినిమాను తెరకెక్కించారు. శ్యామ్సింగరాయ్ ఎవరు? అతడి పోరాటం ఎందుకోసమన్నది ఆసక్తికరంగా ఉంటుంది. 1970 బ్యాక్డ్రాప్లో వచ్చే సన్నివేశాలన్ని ఆనాటి కాలంలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్తాయి.
హీరో నానిపై ఉన్న నమ్మకంతో కథ కూడా పూర్తిగా వినకుండా ఈ సినిమా చేశా. ఆయన ఇచ్చిన భరోసా వల్ల ఎలాంటి ఒత్తిడి లేకుండా సినిమాను పూర్తిచేయగలిగాను. ఆయన సినిమాతోనే సొంత బ్యానర్ను ప్రారంభించాలన్న కల తీరింది. హీరో, దర్శకులపై నిర్మాతకు విశ్వాసం ఉన్నప్పుడే మంచి సినిమా వస్తుందని నమ్ముతాను. యూనివర్సల్ కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దక్షిణాదిలోని అన్ని భాషల్లో విడుదలచేస్తున్నాం.