‘ఫిల్మ్ ప్రొడక్షన్ పరంగా నేను అన్ని విషయాల్ని దగ్గరుండి పర్యవేక్షిస్తాను. దర్శకుల సృజనాత్మక స్వేచ్ఛను గౌరవిస్తూ అవసరమైన సలహాలిస్తాను. మనం ఏం చేసినా కంటెంట్లో బలం ఉన్నప్పుడే సినిమా ప్రేక్షకులకు చేరువవుతుంది’ అన్నారు నిర్మాత వంశీ నందిపాటి. లిటిల్హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, ఈషా వంటి సక్సెస్ఫుల్ చిత్రాలతో నిర్మాతగా, పంపిణీదారుడిగా తనదైన అభిరుచితో ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారాయన. బన్నీవాసుతో కలిసి ఆయన థియేట్రికల్ రిలీజ్ చేస్తున్న తాజా చిత్రం ‘హే భగవాన్’ ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకురానుంది.
సుహాస్, శివానీ నాగరం జంటగా నటించినారు. గోపీ అచ్చర దర్శకుడు. ఈ సందర్భంగా శనివారం వంశీ నందిపాటి విలేకరులతో సినిమా విశేషాలను పంచుకున్నారు. తండ్రీకొడుకుల అనుబంధ నేపథ్య కథాంశమిదని, వినోదంతో పాటు హృదయానికి హత్తుకునే భావోద్వేగాలుంటాయని అన్నారు. సినిమాలో తండ్రి పాత్ర పేరు భగవాన్ కాబట్టి ‘హే భగవాన్’ అనే టైటిల్ ఈ సినిమాకు పెట్టామని వంశీ నందిపాటి తెలిపారు.
రాబోవు రోజుల్లో చిన్న సినిమాల నిర్మాణం మరింతగా ఊపందుకుంటుందని, ఇటీవల ఒకనెలలోనే ఫిల్మ్ ఛాంబర్లో 300 సినిమాల టైటిల్స్ రిజిస్టర్ అయ్యాయని వివరించారు. సుహాస్ గత కొంతకాలంగా మంచి కమర్షియల్ హిట్కోసం ఎదురుచూస్తున్నారని, ఈ సినిమాతో అతని కల నెరవేరుతుందన్నారు. తమ సంస్థలో తదుపరి చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ప్రస్తుతం ‘పొలిమేర-3’ వర్క్ జరుగుతున్నది. ఏప్రిల్ లేదా మే నెలలో సెట్స్ మీదకు తీసుకొస్తాం. అలాగే ఈటీవి విన్తో కలిసి మరో ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఈ నెల 27న ఆ సినిమా ప్రకటన ఉంటుంది’ అని వంశీ నందిపాటి పేర్కొన్నారు.