2019 జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ‘జెర్సీ’ చిత్రం ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డుకు ఎంపికైన సందర్భంగా చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ మంగళవారం పాత్రికేయులతో ముచ్చటించారు. ‘జెర్సీ’ అవార్డు తాలూకు ఆనందాన్ని పంచుకుంటూనే..తమ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందించిన తాజా చిత్రం ‘రంగ్దే’ ఈ నెల 26న విడుదలవుతున్న సందర్భంగా ఈ సినిమా విశేషాల్ని కూడా వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ “జెర్సీ’ సినిమాకు పురస్కారాలు లభిస్తాయని ముందే ఊహించాం. మా సంస్థ నిర్మించిన సినిమాకు తొలిసారి నేషనల్ అవార్డు రావడం చాలా సంతోషాన్నిచ్చింది. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కథ చెప్పగానే అందులోని ఎమోషన్స్తో వెంటనే కనెక్ట్ అయిపోయా. స్వతహాగా నాకు క్రికెట్ అంటే ఇష్టం ఉండటంతో కథపై మరింత ఆసక్తికలిగింది. అయితే ఏడేళ్ల కొడుకు తండ్రి పాత్రకు హీరో నాని ఒప్పుకుంటాడో లేడో అనే సందేహాలొచ్చాయి. కథ వినగానే మరో ఆలోచన లేకుండా నాని సినిమాకు ఓకే చెప్పారు. ‘రంగ్దే’ చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్. 24ఏళ్ల ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ కథ ఇది. వినోదంతో పాటు భావోద్వేగాలు కలబోసి ఉంటాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడిగా మా సంస్థ నిర్మించే సినిమా ఏప్రిల్ నెలాఖరున లేదా మే మొదటివారంలో ప్రారంభమవుతుంది. పవన్కల్యాణ్, రానాతో చేస్తున్న ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ బాగా వస్తోంది. తెలుగు నేటివిటీకి తగినట్లుగా స్క్రిప్ట్లో కొన్ని మార్పులు చేశాం. ఈ సినిమాలో రానాకు జోడీగా ఐశ్వర్యరాజేష్ కథానాయికగా నటిస్తోంది. పవన్కల్యాణ్ సరసన నటించే నాయిక ఎవరన్నది ఇంకా ఖరారు కాలేదు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రస్తుతం ‘వరుడు కావలెను’ ‘నరుడి బ్రతుకు నటన’ సినిమాల చిత్రీకరణ జరుగుతోంది. మలయాళ చిత్రం ‘కప్పేలా’ను ‘బుట్టబొమ్మ’ పేరుతో రీమేక్ చేద్దామనుకుంటున్నాం. బెల్లంకొండ సురేష్ చిన్నబ్బాయి గణేష్బాబు కథానాయకుడిగా ఓ సినిమా చేస్తున్నాం.