సుప్రసిద్ధ నిర్మాత ఆర్బీ చౌదరి(83) కన్నుమూశారు. మంగళవారం రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆర్బీ చౌదరి అసలు పేరు రతన్లాల్ భగత్రామ్ చౌదరి. సూపర్గుడ్ ఫిల్మ్స్ పేరిట చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి, తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. దాదాపు 90కి పైచిలుకు చిత్రాలను నిర్మించిన ఘనత ఆర్బీ చౌదరి సొంతం. మలయాళ చిత్రం ‘ఆదిపాపమ్'(1988) నిర్మాతగా ఆర్బీ చౌదరి తొలి సినిమా. తమిళంలో విక్రమన్ దర్శకత్వంలో నిర్మించిన ‘పుదువసంతం’ (1990) చిత్రం నిర్మాతగా ఆర్బీ చౌదరికి పెద్ద బ్రేక్. ఆ సినిమా తెలుగులో అదే ఏడాది ‘నవవసంతం’గా విడుదలై ఘన విజయాన్ని అందుకున్నది.
తమిళంలో ఆయన నిర్మించిన ‘నాట్టమై’ చిత్ర కథతో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో మోహన్బాబు ‘పెదరాయుడు’ చిత్రాన్ని నిర్మించి అఖండ విజయాన్ని అందుకున్నారు. కోలీవుడ్ సంచలనం దళపతి విజయ్ కెరీర్కి మేలి మలుపైన ‘పువ్వై వణక్కాగా’(1996) చిత్రానికి నిర్మాత కూడా ఆర్బీ చౌదరే. ఆ సినిమా తెలుగులో ‘శుభాకాంక్షలు’గా విడుదలై ఇక్కడ కూడా ఘన విజయాన్ని అందుకున్నది. విజయ్తో లవ్టుడే, తుళ్లాత మనముమ్ తుళ్లుమ్, షాజహాన్, తిరుపాచ్చి, జిల్లా వంటి చిత్రాలను నిర్మించారు. తమిళంలో ఆయన నిర్మించి, విజయవంతమైన ప్రతి సినిమానూ తెలుగులోనూ నిర్మించేవారు ఆర్బీ చౌదరి.
సుస్వాగతం, సూర్యవంశం, రాజా, నువ్వొస్తావని, నిన్నే ప్రేమిస్తా, శివరామరాజు, ప్రియమైన నీకు, సంక్రాంతి, వసంతం, సింహరాశి, అన్నవరం, గోరింటాకు తదితర చిత్రాలు అలా వచ్చినవే. చిరంజీవి హీరోగా రూపొందిన ‘గాడ్ఫాదర్'(2022) తెలుగులో ఆయన నిర్మించిన చివరి భారీ సినిమా. ఆయన కుమారుడు జీవా హీరోగా తమిళనాట కొనసాగుతున్నారు. మరో కుమారుడు జితన్ రమేశ్ నిర్మాతగా ఉన్నారు. ఆయన గతేడాదే తన 99వ సినిమా ‘మకుటం’ను ప్రారంభించారు. విశాల్ ఇందులో హీరో. రజనీకాంత్తో 100వ చిత్రాన్ని తీయాలన్నది ఆర్.బి.చౌదరి డ్రీమ్. ఆ కల నెరవేరకుండానే ఆయన ఇలా అకాలమరణం చెందడం దక్షిణాది సినిమాను దిగ్భ్రాంతికి గురి చేసింది.