Allu Arjun | ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆయా పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేయగా.. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలో నిక్షిప్తమైంది. ఇదిలా ఉండగా.. వైఎస్సార్సీపీకి అల్లు అర్జున్ మద్దతు తెలుపడంపై ఇంకా విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. అల్లు అర్జున ఇటీవల నంద్యాలకు చెందిన వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. స్వయంగా నంద్యాలకు వెళ్లి.. రవిచంద్రారెడ్డిని గెలిపించాలని కోరారు. ఏపీలో జనసేన తెలుగుదేశం కూటమితో కలిసి పని చేస్తుండగా.. బన్నీ వైఎస్సార్సీపీకి మద్దతు తెలుపడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
మెగా హీరోలతో పాటు టాలీవుడ్కు చెందిన పలువురు సినిమా నటీనటులు, టీవీ నటులు సైతం పవన్ కల్యాణ్కు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సినీ నిర్మాత నట్టి కుమార్ స్పందించారు. పవన్ కల్యాన్కు మెగా కుటుంబం మద్దతుగా ఉందని.. కుటుంబంలోని ఒక సభ్యుడు సపోర్ట్ చేయనంత మాత్రాన పవన్కు వచ్చే నష్టమేమీ లేదన్నారు. మెగాస్టార్ చిరంజీవి మహా వృక్షమని.. ఆయన కారణంగా మెగా హీరోలంతా ఎదిగారన్నారు. అల్లు అర్జున్ కూడా అంతేనని.. వైఎస్సార్సీపీ అభ్యర్థి కోసం బన్నీ వెళ్లడం తనకు నచ్చలేదన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని.. దీనిపై బన్నీ ఆలోచించాలని సూచించారు.
బన్నీ వెళ్లిన ఫొటోలు, వీడియోలను వైఎస్సార్సీపీ తనకు అనుకూలంగా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుందన్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మంత్రులందరూ ఓటమిని చవిచూడబోతున్నారని జోస్యం చెప్పారు. ఉత్తరాంధ్రలో కూటమి ఘన విజయం సాధించబోతుందని.. క్షేత్రస్థాయిలోని పరిస్థితి తెలిసిన వ్యక్తిగా ఈ విషయం చెబుతున్నానన్నారు. ఓటమి భయంతో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు దాడులకు పాల్పడుతున్నారని.. కొందరు అధికారులు తొత్తులుగా మారి అల్లర్లకు సపోర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. జన్మభూమిపై మమకారంతో పెద్ద సంఖ్యలో ఓటర్లు ఎన్నికల్లో ఓటు వేశారని.. గతంలో ఇలా ఎప్పుడూ జరుగలేదన్నారు. ఏపీ అభివృద్ధిని కాంక్షించి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.