హైదరాబాద్: ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) అల్లుడికి చెందిన పోర్షే కారు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో అపహరణకు గురయింది. దిల్రాజ్ అల్లుడు అర్చిత్ రెడ్డి (Archith Reddy) జూబ్లీహిల్స్లోని దసపల్లా హోటల్కు (Daspalla Hotel) రూ.1.7కోట్ల విలువైన తన పోర్షే కారులో (Porsche car) శుక్రవారం ఉదయం వెళ్లారు. కారును హోటల్ వద్ద నిలిపి లోపలికి వెళ్లి తిరిగి రాగా కారు కనిపించలేదు. దీంతో ఆయన జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ చెక్పోస్టు వద్ద కారు సిగ్నల్ జంప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే కేబీఆర్ పార్క్ వద్ద ఉన్న ట్రాఫిక్ పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
అయితే నిందితుడిని మన్సూరాబాద్ ప్రాంతానికి చెందిన మల్లెల సాయికిరణ్గా గుర్తించారు. తాను రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ వ్యక్తిగత సహాయకుడినని, కేటీఆర్ కారు తీసుకెళ్లాలని సూచించారని, తన సహాయకుడు హృతిక్రోషన్తో కలిసి కారులో అకాశ్ అంబానీని కలవడానికి వెళ్తున్నానని చెప్పాడు. కాగా, అతని కుటుంబ సభ్యులకు ఫోన్ చేయగా మతిస్థిమితం లేదని, బ్రైట్ లైఫ్ ఫౌండేషన్ సంస్థలో చికిత్స పొందినట్లు చెప్పారు.