రాజమౌళి సినిమా అంటేనే ప్రత్యేకతల సమాహారం. ఇతరుల చిత్రాల్లో కనిపించని ఏదో ఒక మ్యాజిక్ రాజమౌళి సినిమాల్లో ఉంటుంది. అందుకే ఆయన సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అంత క్రేజ్. ప్రస్తుతం ఆయన మహేష్బాబుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘SSMB29’ వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్నారు. రీసెంట్గా ఈ సినిమా రెండో షెడ్యూల్ ఒడిశా హిల్స్పై జరిగిన విషయం తెలిసిందే. అక్కడ షూటింగ్ జరపడానికి బలమైన కారణమే ఉందట.
తాజా సమాచారం ప్రకారం ఒడిశా నేపథ్యం ఈ కథలో కీలకమట. అందుకే.. అక్కడ పేరెన్నికగన్న ‘మయూర్ భంజ్ ఛౌ’ అనే నృత్యాన్ని నేర్చుకోవాల్సిందిగా ప్రియాంక చోప్రాకి ఆర్డర్ పాస్ చేశారట రాజమౌళి. దాంతో ఈ నృత్యంలో ప్రసిద్ధి చెందిన ఒడిశా కళాకారుడు విక్కీ భర్తయ ఆధ్వర్యంలో ప్రియాంక చోప్రా ఈ నృత్యాన్ని అభ్యసించారు. మూడు విభిన్న రీతుల్లో ఈ నృత్యం ఉంటుందని సమాచారం. ఈ నృత్యం కథలో కీలకంగా ఉంటుందట.
ప్రియాంకకు నృత్యం నేర్పిన భర్తయా రీసెంట్గా ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘ప్రియాంకకు నృత్యం నేర్పడం గొప్ప అనుభవం. నృత్యాన్ని అభ్యసించడంలో ఆమె చూపించిన ఆసక్తి నిజంగా స్పూర్తిదాయకం. పెద్ద హీరోయిన్ని అన్న భావన తనలో ఎక్కడా కనిపించలేదు. ఈ ప్రతిష్టాత్మక ప్రయాణంలో నేనూ భాగం అయినందుకు సంతోషిస్తున్నా’ అని తెలిపారు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే ట్రజర్ హంట్ మూవీ ఇదని ఇప్పటివరకూ వార్తలొచ్చాయి. ఇప్పుడేమో ఒడిశా నేపథ్యం అంటున్నారు. మరి వీటిలో నిజం రాజమౌళీకే తెలియాలి.