Priyanka Chopra | ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ+ హాట్స్టార్లో ‘టైగర్’ అనే సరికొత్త డాక్యుమెంటరీ విడుదలైన విషయం తెలిసిందే. నేటి నుంచి ఈ డాక్యుమెంటరీ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ డాక్యుమెంటరీలో అంబా అనే ఆడపులి పాత్రకు తన గొంతు అరువిచ్చింది మాజీ ప్రపంచ సుందరి బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా(Priyanka Chopra). అడవి నేపథ్యంగా సాగిన ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వడంపై ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న ప్రియాంక తాజాగా స్పందించింది.
‘ప్రకృతికి సంబంధించిన సినిమాలకు నేను పెద్ద అభిమానిని. ఇండియా నుంచి వస్తున్న టైగర్కు నా గొంతుతో ప్రేక్షకులకు దగ్గరవ్వడం గొప్ప అవకాశంగా భావిస్తున్నా. అంబ అనే పులి తన పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకునే ఇతివృత్తంతో సాగిన ‘టైగర్’ సినిమా ప్రస్థానం ఎనిమిదేండ్లకు పైగానే సాగింది. ఓ నటిగా ఆడియో విజువల్ మాధ్యమానికి అలవాటు పడ్డా. ఇప్పుడు కేవలం నా వాయిస్తోనే భావోద్వేగాలను పండించగలగాలి. తొలిసారి ఓ సరికొత్త పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చాను. నా వాయిస్ను జంతువులకు అందించాలనే కోరిక ‘టైగర్’తో నెరవేరింది. ఈ చిత్రం అడవిని వీక్షకుల కండ్లముందు ఉంచుతుంది.’ అంటూ చెప్పుకోచ్చింది.