న్యూయార్క్: అమెరికాలో ప్రసారం కానున్న రియాల్టీ టీవీ షో ద యాక్టివిస్ట్ వివాదంలో ఇరుక్కున్నది. అయితే ఆ షోలో హోస్ట్గా చేస్తున్న బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా క్షమాపణలు చెప్పింది. ద యాక్టివిస్ట్ అనే రియాల్టీ షోలో.. నటి ప్రియాంకాతో పాటు సింగర్ ఉషర్, డ్యాన్సర్ జూలియేన్ హగ్లు కూడా హోస్ట్గా చేస్తున్నారు. వాస్తవానికి ఈ కార్యక్రమం అక్టోబర్ నుంచి సీబీఎస్ ఛానల్లో ప్రసారం కానున్నది. ఇద్దరేసి కార్యకర్తలతో.. మూడు గ్రూపుల మధ్య .. ఓ దాతృత్వ కారణం కోసం పోటీ జరుగుతుంది. ఆ షోలో ఆరోగ్యం, విద్య, పర్యావరణం లాంటి అంశాలపై మేటి కార్యకర్తలతో చర్చించనున్నారు. వారిచ్చే సలహాలు, సూచనలను ఇటలీలో జరిగే జీ20 సదస్సులో వెల్లడించాలని ప్లాన్ వేశారు.
అయితే ద యాక్టివిస్ట్ను సిరీస్ రూపంలో తీసుకురావాలనుకున్నారు. కానీ ఆ తర్వాత దీన్ని డాక్యుమెంటరీగా తీయాలని నిర్ణయించారు. ప్రసారం కావడానికి ముందే ఆ షోపై విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలను గ్లోబల్ సిటిజన్ ఆహ్వానించింది. గ్లోబల్ యాక్టివిజమ్ అనేది సహకారంతో జరుగుతుందని, పోటీతత్వంతో కాదు అని గ్లోబల్ సిటిజన్ పేర్కొన్నది. రియాల్టీ షోతో తాను కుదుర్చుకున్న ఒప్పందం ఎందర్నో నిరాశపరిచిందని, దానికి సారీ చెబుతున్నానని ప్రియాంకా చోప్రా తన ట్వీట్లో తెలిపింది. ఒక మంచి కారణం కోసం అందరూ చేతులు కలిపితే, అప్పుడు ప్రభావం ఉంటుందని ఆమె అన్నది.