అభిరుచి గల టాలీవుడ్ నిర్మాతల్లో శివలెంక కృష్ణప్రసాద్ ఒకరు. ఆయన నిర్మాణంలో ఇంద్రగంటి మోహన్కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా సోమవారం మొదలైంది. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే జెంటిల్మెన్, సమ్మోహనం సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ముచ్చటగా మూడోసారి వీరి కాంబినేషన్లో సినిమా రూపొందుతుండటం విశేషం.
ప్రియదర్శి, రూప కొడువాయూర్ ఇందులో జంటగా నటిస్తున్నారు. సోమవారం సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. దేవునిపటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి శివలెంక కృష్ణప్రసాద్ సతీమణి అనిత క్లాప్ ఇవ్వగా, దర్శకుడు ఇంద్రగంటి మోహన్కృష్ణ సతీమణి ఉమామహేశ్వరి కెమెరా స్విచాన్ చేశారు.
‘మా సంస్థకు ఆత్మీయుడు, నాకు అత్యంత సన్నిహితుడైన మోహనకృష్ణ ఇంద్రగంటితో మళ్లీ సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ కథకు హీరోహీరోయన్లుగా ప్రియదర్శి, రూప సరిగ్గా సరిపోతారు. వినోదంతోపాటు భావోద్వేగాలతో కూడిన స్వీట్ ఎంటర్టైనర్ ఈ సినిమా.
జంధ్యాలగారి సినిమాలు గుర్తు చేసేంత క్యూట్గా ఈ సినిమా ఉంటుంది.’ అన్నారు నిర్మాత శివలెంక. వి.కె.నరేశ్, తనికెళ్ల భరణి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిశోర్, వైవ హర్ష, శివన్నారాయణ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పి.జి.విందా, సంగీతం: వివేక్సాగర్.