‘కళ్యాణం కమనీయం’ చిత్రం ద్వారా తెలుగులో కథానాయికగా అరంగేట్రం చేస్తున్నది ప్రియా భవానీ శంకర్. ఈ సినిమాలో తాను పోషించిన శృతి పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుందని ఆనందం వ్యక్తం చేసిందామె. యూవీ కాన్సెప్ట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో సంతోష్ శోభన్ హీరోగా నటించారు. అనిల్ కుమార్ ఆళ్ల దర్శకుడు. ఈ నెల 14న ప్రేక్షకుల విడుదలకానుంది. ప్రియా భవానీ శంకర్ మాట్లాడుతూ ‘తమిళంలో నేను చాలా చిత్రాలు చేశాను. యూవీ వంటి పెద్ద సంస్థ ద్వారా తెలుగులో లాంచ్ కావడం ఆనందంగా ఉంది.
నిజ జీవితానికి దగ్గరగా ఉండే చిత్రమిది. ఎటువంటి ఇగో సమస్యలు లేని భార్యభర్తల మధ్య జరిగిన సంఘటనలు, వాటితో ముడిపడిన భావోద్వేగాల నేపథ్యంలో కథ నడుస్తుంది. ఎలాంటి పనిలేని భర్త, ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించే భార్య మధ్య జరిగే డ్రామా ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది.
ఈ సినిమాలో నేను పోషించిన శృతి పాత్ర నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే పాత్ర పోషణలో ఎలాంటి కష్టమనిపించలేదు. సంతోష్ శోభన్ తెలుగు సంభాషణల విషయంలో సహాయం చేశారు. ఈ కథతో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. ప్రస్తుతం తెలుగులో మంచి ఆఫర్లొస్తున్నాయి. నాగచైతన్యతో ఓ సినిమా, సత్యదేవ్ 26 చిత్రాల్లో నటిస్తున్నా’ అని చెప్పింది.