Preity Zinta | బాలీవుడ్ ప్రముఖ నటి ప్రీతి జింతా బాంబే హైకోర్టును ఆశ్రయించింది. తన అనుమతి లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత వాడి సృష్టించిన డీప్ఫేక్ చిత్రాలు, మార్ఫింగ్ చేసిన అసభ్యకర కంటెంట్కు వ్యతిరేకంగా ఆమె కోర్టుకు వెళ్లింది. ఈ కంటెంట్ను ఇంటర్నెట్ నుండి పూర్తిగా తొలగించేలా అత్యవసర ఆదేశాలు ఇవ్వాలని ఆమె కోర్టును కోరారు. ఇక ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ మాధవ్ జామదార్.. కంటెంట్ను వెబ్సైట్ల నుండి తొలగించడానికి ఒక సులువైన విధానాన్ని రూపొందించాలని ఇరు పక్షాలకు సూచించింది. కాగా దీనిపై తదుపరి విచారణ జూలై 6న జరగనుంది.
ప్రీతి జింతా దాఖలు చేసిన ఈ వ్యాజ్యంలో గూగుల్, మెటా వంటి సోషల్ మీడియా సంస్థలతో పాటు డొమైన్ నేమ్ రిజిస్ట్రార్లను ప్రతివాదులుగా చేర్చారు. నటి తరఫు సీనియర్ అడ్వకేట్ వెంకటేష్ ధోండ్ వాదనలు వినిపిస్తూ.. రోజురోజుకూ ఈ డీప్ఫేక్స్ నాణ్యత పెరుగుతోందని, అందువల్ల తక్షణమే సదరు లింకులను తొలగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. మరోవైపు గూగుల్, మెటా సంస్థల తరఫు న్యాయవాదులు స్పందిస్తూ.. వివాదాస్పద లింకులను తొలగించడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, అయితే సాధారణ చట్టబద్ధమైన కంటెంట్ను ముందస్తుగా పర్యవేక్షించి బ్లాక్ చేయాలనే నిబంధనలు విధించవద్దని కోర్టును అభ్యర్థించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. సాధారణ కంటెంట్కు ఇబ్బంది లేకుండా, కేవలం అభ్యంతరకర లింకులను మాత్రమే తొలగించేలా ఒక ప్రాక్టికల్ ప్రోటోకాల్ను సిద్ధం చేయాలని ఆదేశించారు.