Prathyusha Case : టాలీవుడ్ నటి ప్రత్యూష మృతి కేసు (Prathyusha Case)లో ప్రధాన నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి (Siddharth Reddy) లొంగిపోయాడు. నాంపల్లి కోర్టులో సోమవారం అతడు సరెండర్ అయ్యాడు. ఫిబ్రవరి 17న సిద్దార్థ్ అభ్యర్థనలను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు.. అతడిని నాలుగు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది. 24 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్న అతడు.. ఎట్టకేలకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లొంగిపోయాడు.
సినీ నటిగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే ప్రత్యూష ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. తమ ప్రేమను కుటుంబ సభ్యులు వ్యతిరేకించడంతో ప్రియుడు సిద్ధార్థ్ రెడ్డి, ఆమె కూల్డ్రింక్లో పురుగుల మందు కలుపుకొని తాగారు. చికిత్స పొందుతూ ప్రత్యూష 2022 ఫిబ్రవరి 23న మరణించగా.. సిద్దార్ధ్ ప్రాణాలతో బయటపడ్డాడు.
అయితే.. తన కూతురు ప్రత్యూషది ఆత్మహత్య కాదు హత్య అని ఆమె తల్లి కేసు వేసింది. దాంతో, ట్రయల్ కోర్టులో సిద్ధార్థ్కు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. అయితే.. ఈ వ్యవధిని హైకోర్టు రెండేళ్లకు తగ్గించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లాడు సిద్ధార్థ్. కానీ, అత్యున్నత ధర్మాసనం సైతం హైకోర్టు తీర్పునే సమర్ధించింది. నాలుగు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు చివరి రోజున సిద్ధార్థ్ నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు.
నటి ప్రత్యూష, సిద్ధార్థరెడ్డి హైదరాబాద్లో ఇంటర్మీడియట్ చదువుతున్న సమయం నుంచి ప్రేమించుకున్నారు. ఆ తర్వాత ప్రత్యూష సినీ రంగంలో స్థిరపడగా, సిద్ధార్థరెడ్డి ఇంజినీరింగ్లో చేరాడు. అయితే 2002 ఫిబ్రవరి 23న వీరిద్దరూ విషం తాగిన స్థితిలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 24న చికిత్స పొందుతూ ప్రత్యూష మరణించగా, సిద్ధార్థరెడ్డి కోలుకుని మార్చి 9న డిశ్చార్జి అయ్యాడు. కూల్డ్రింక్లో పురుగుమందు కలుపుకుని తాగడం వల్లే ప్రత్యూష మరణించినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. అప్పట్లో ఆమెపై లైంగిక దాడి జరిగిందన్న ఆరోపణలు వచ్చినప్పటికీ.. ప్రభుత్వం నియమించిన వైద్య బృందం వాటిని తోసిపుచ్చింది.
Actress Prathyusha | రెండు దశాబ్దాల నిరీక్షణకు తెర.. నటి ప్రత్యూష కేసులో నిందితుడు లొంగిపోవాలని సుప్రీం ఆదేశం-Namasthe Telanganahttps://t.co/TtyqCzZsr8
— Namasthe Telangana (@ntdailyonline) February 17, 2026
అయితే ఈ కేసును దర్యాప్తు చేసిన సీబీఐ.. సిద్ధార్థరెడ్డిపై ఆత్మహత్యకు పురికొల్పడం, ఆత్మహత్యకు యత్నించడం వంటి సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు 2004లో ఆయనకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అనంతరం సిద్ధార్థరెడ్డి హైకోర్టును ఆశ్రయించగా, 2011లో కోర్టు ఆ శిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ జరిమానాను పెంచింది. ఈ తీర్పుపై ఇటు సిద్ధార్థరెడ్డి, అటు ప్రత్యూష తల్లి సరోజినీదేవి 2012లో సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. సుదీర్ఘ కాలం పాటు సాగిన ఈ న్యాయపోరాటంలో అన్ని అంశాలను పరిశీలించిన సుప్రీంకోర్టు, చివరకు హైకోర్టు విధించిన శిక్షనే ఖరారు చేస్తూ ఈ సంచలన తీర్పును వెలువరించింది.