K Vasu | తెలుగు ఇండస్ట్రీ (Telugu Industry)లో ఈ మధ్య వరస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరిని మరిచిపోక ముందే మరొకరు భౌతికంగా మనకు దూరం అవుతూ కోలుకోలేని విషాదాన్ని నింపుతున్నారు సినీ ప్రముఖులు. నాలుగు రోజుల కింద లెజెండరీ సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూసిన బాధ నుంచి తీరిపోకముందే.. మరో సీనియర్ నటుడు శరత్ బాబు మరణ వార్త అందరినీ కలిచి వేసింది.
ఈ ఇద్దరి మధ్యలో ట్రిపుల్ ఆర్ సినిమాలో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన స్కాట్ దొర రే స్టీవెన్సన్ హఠాన్ మరణం కూడా అందరికీ షాక్ ఇచ్చింది. అంతలోనే మరో విషాదం జరిగిపోయింది. టాలీవుడ్ సీనియర్ దర్శకుడు కే వాసు (K Vasu) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన కాసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. చిరంజీవి మొదటి సినిమా ప్రాణం ఖరీదు (Pranam Khareedu) దర్శకుడు ఈయనే.
ఆ సినిమా మంచి విజయం సాధించడమే కాకుండా కే వాసుకు దర్శకుడిగా గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత విజయ్ చందర్ హీరోగా వచ్చిన శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం సినిమాతో కే వాసు దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఆ తర్వాత చిరంజీవితో అల్లుళ్లు వస్తున్నారు సినిమా తెరకెక్కించారు. సుమన్ తో అమెరికా అల్లుడు, శ్రీకాంత్ ప్రభుదేవా హీరోలుగా వచ్చిన ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి లాంటి సినిమాలను కే వాసు తెరకెక్కించారు. ఈయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.