Varanasi | రాజమౌళి–మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2027లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. ఇప్పటికే జరిగిన గ్రాండ్ ఈవెంట్లో ‘వారణాసి’ టైటిల్ను అధికారికంగా ప్రకటించడంతో పాటు, మూవీ గ్లింప్స్ను విడుదల చేయగా అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ అనే పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.
ఇక ఇతర నటీనటుల వివరాలపై చిత్ర బృందం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. అయితే తాజా రూమర్ల ప్రకారం ఈ సినిమాలో సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మహేష్ బాబు తండ్రి పాత్రలో ప్రకాశ్ రాజ్ను తీసుకున్నారని టాలీవుడ్లో చర్చ జరుగుతోంది. ఈ పాత్ర కోసం మొదట బాలీవుడ్ నటుడు నానా పటేకర్ను సంప్రదించినా, చివరికి ప్రకాశ్ రాజ్ను ఎంపిక చేసినట్లు సమాచారం.
ప్రకాష్ రాజ్కు దర్శకుడు రాజమౌళితో మంచి అనుబంధం ఉంది. గతంలో ‘విక్రమార్కుడు’ సినిమాలో వీరిద్దరూ కలిసి పని చేయగా, ఇప్పుడు మళ్లీ అదే కాంబో రిపీట్ అవుతుందనే వార్తలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇటీవల సినిమాలకంటే ఇతర విషయాలతో వార్తల్లో నిలిచిన ప్రకాశ్ రాజ్ .. పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’లో కీలక పాత్రలో కనిపించాడు. ప్రస్తుతం దళపతి విజయ్ నటిస్తున్న ‘జన నాయగన్’ చిత్రంలోనూ ఆయన నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘వారణాసి’లో ఆయన పాత్రపై అధికారిక ప్రకటన వస్తే, ఈ సినిమా హైప్ మరింత పెరిగే అవకాశముంది.2027లో వారణాసి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.