‘మా’ ఎన్నికల్లో గెలిచిన ప్రకాష్రాజ్ ప్యానల్ సభ్యులందరూ మంగళవారం తమ పదవులకు రాజీనామా చేశారు. అధ్యక్షుడిగా గెలిచిన విష్ణు తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎలాంటి అడ్డంకులు లేకుండా స్వేచ్ఛగా అమలు చేయాలనే ఉద్దేశంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకాష్రాజ్ చెప్పారు. ఎన్నికల రోజున మోహన్బాబు తమను అసభ్యపదజాలంతో దూషించారని బెనర్జీ, తనీష్ ఆవేదన వ్యక్తం చేశారు.తన ప్యానల్ సభ్యులతో కలిసి మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
అలాంటి భావజాలం ఉన్నవాళ్లతో పనిచేయలేము: ప్రకాష్రాజ్
ఎన్నికల రోజు అధ్యక్షుడితో పాటు ఆఫీస్ బేరర్ల ఫలితాల్ని ప్రకటించి ఈసీ మెంబర్స్ లెక్కింపును వాయిదావేశారు. మొదటిరోజు మా ప్యానల్ నుంచి 11 మంది గెలిచామని చెప్పారు. తర్వాత రోజు మాత్రం ఎనిమిది మంది మాత్రమే గెలిచారని ప్రకటించారు. ముందురోజు గెలిచిన వారు ఆ తర్వాత ఎందుకు ఓడిపోయారన్నది ఆశ్చర్యం కలిగించింది. ఫలితాల అనంతరం జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ మావాడే అని విష్ణు చేసిన వ్యాఖ్యలు బాధించాయి. మీరు..మేము అనే భావజాలం ఉన్న వాళ్లతో కలిసి పనిచేయలేమనే నిర్ధ్దారణకు వచ్చాం. గొడవల వల్ల సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోకూడదు. అందుకే రానున్న రెండేళ్లు విష్ణు బాగా పనిచేయడానికి మేము అడ్డుగా ఉండకూడదని నిర్ణయించుకున్నాం. అందుకే మా ప్యానల్ నుంచి గెలిచిన పదకొండు మంది రాజీనామా చేశారు. అసోసియేషన్ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆవేశంతో కాకుండా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం. తనకు కావాల్సిన వాళ్లను నియమించుకొని స్వేచ్ఛగా పనిచేయమని విష్ణును కోరుతున్నాం. మీరు పనిచేయని పక్షంలో సభ్యుల తరపున ప్రశ్నిస్తాం. తెలుగేతరులు పోటీ చేయడానికి అనర్హులు అంటూ భవిష్యత్తులో అసోసియేషన్ నియమనిబంధనలను మార్చనని విష్ణు మాటిస్తేనే ‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి నేను చేసిన రాజీనామాను వెనక్కి తీసుకుంటా. తెలుగేతరులు కేవలం ఓటెయ్యడానికి, గెలిపించడానికి మాత్రమే పరిమితమని అంటే అలాంటి అసోసియేషన్లో కొనసాగడం నాకు ఇష్టం లేదు. ఆత్మ, పరమాత్మ అంటూ కొత్త అసోసియేషన్లు పెట్టే ఆలోచన నాకు లేదు. ‘మా’లో ఉన్నవారితోనే కలిసి పనిచేస్తాను.
విభేదాలకు ఫుల్స్టాప్: శ్రీకాంత్
అసోసియేషన్లో అభివృద్ధి జరగాలంటే పదవులకు రాజీనామా చేయడమే మంచిదనుకున్నాం. ఏదైనా ఒక ప్యానల్ సంపూర్ణంగా గెలిస్తేనే అసోసియేషన్లో అన్ని పనులు సక్రమంగా జరుగుతాయి. కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒక్కో ప్యానల్ నుంచి కొంత మంది విజయం సాధించారు. ఇన్ని గొడవల అనంతరం అందరం కలిసి పనిచేయగలమా అనే అనుమానం తలెత్తింది. తప్పు జరిగితే ధైర్యంగా ప్రశ్నించేవారు మా ప్యానల్తో ఉన్నారు. మేము ప్రశ్నించడం వల్ల మళ్లీ గొడవలు జరిగే ఆస్కారముంది. అలాంటివి జరగకూడదనే ఆలోచనతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బాగుండాలనే పదవులకు రాజీనామా చేస్తున్నాం. విష్ణు ప్యానల్తో ఉన్న విభేదాలకు ఫుల్స్టాప్ పెడుతున్నాం.
మోహన్బాబు బూతులు తిట్టారు: బెనర్జీ
ఎన్నికల్లో గెలిచిన ఆనందం తనలో లేదని బెనర్జీ అన్నారు. పోలింగ్ రోజున మోహన్బాబు తనను దుర్భాషలాడారని ఆయన కన్నీటిపర్యంతమయ్యారు. ‘ఓట్ల లెక్కింపు సమయంలో మోహన్బాబు… తనీష్ను తిడుతున్నారు. గొడవలు వద్దని విష్ణుకు చెప్పాను. నా మాటలు విన్న మోహన్బాబు ఆగ్రహంతో నన్ను కొట్టడానికి వచ్చారు. బూతులు మాట్లాడారు. ఆయన మాటలు షాక్కు గురిచేశాయి. భవిష్యత్తులో కార్యవర్గ సమావేశాలు జరిగినప్పుడు వారిని ప్రశ్నించేందుకు భయపడాల్సిన పరిస్థితి ఉంది. భయపడుతూ అసోసియేషన్లో ఉండటం కంటే రాజీనామా చేయడమే మంచిది’ అని బెనర్జీ చెప్పారు.
ధైర్యంగా నా గళాన్ని వినిపించలేను: తనీష్
ఓట్ల లెక్కింపు జరుగుతున్నప్పుడు నేను ఏ తప్పు చేయకపోయినా మోహన్బాబు నన్ను దూషించడమే కాకుండా కొట్టడానికి వచ్చారు. నా తల్లిని కూడా తిట్టారు. గొడవ ఆపడానికి వచ్చిన బెనర్జీపై కూడా ఆగ్రహంతో ఊగిపోయారు. మోహన్బాబు అన్న మాటలు ఎంతగానో బాధించాయి. వాటిని జీర్ణించుకోలేకపోతున్నా. భవిష్యత్తులో కార్యవర్గ సమావేశాలు జరిగినప్పుడు నా గళాన్ని ధైర్యంగా వినిపించలేననిపించింది. అందుకే ఈసీ సభ్యుడిగా నా పదవికి రాజీనామా చేస్తున్నా.
సినిమా పదమే లోకల్ కాదు: ఉత్తేజ్
బల్బును కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్, సినిమాకు రూపకల్పన చేసిన లూమియర్ బ్రదర్స్, మాయబజార్ సృష్టికర్త మార్కస్ బాట్లేలు ఎవరూ లోకల్ కాదు. అసలు సినిమా అన్న పదమే లోకల్ కాదు. అలాంటిది ‘మా’ ఎన్నికల్లో లోకల్ నాన్లోకల్ అన్న నినాదం తెరపై తీసుకురావడం బాధగా అనిపించింది. ఎన్నికల రోజున నరేష్ నన్ను అసభ్యపదజాలంతో తిట్టారు. గెలిచిన తర్వాత ‘మా’ కార్యాలయంలోకి వెళితే థంబ్ వేసి రావాలన్నారు. గెలిచిన సభ్యులనే ‘మా’లోకి రాకుండా అడ్డుకుంటే ఇక కలిసి పనిచేయడం కష్టమనే భావన కలిగింది.