హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలపై తమకు కొన్ని అనుమానాలు ఉన్నాయని నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. సందేహాల నివృత్తికోసం పోలింగ్ కేంద్రానికి వెళ్లామని చెప్పారు. సోమవారం జూబ్లీహిల్స్ పోలీసుల సమక్షంలో పోలింగ్ రోజు నాటి సీసీ కెమెరా ఫుటేజీని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఉద్రిక్తత జరిగిందన్నారు. ఫిర్యాదులపై ఎన్నికల అధికారి స్పందించట్లేదని తెలిపారు. అయితే సీసీ ఫుటేజీ చూసుకోవచ్చని మంచు విష్ణు చెప్పారన్నారు. ఎన్నికల అధికారి మాత్రం కోర్టుకు వెళ్లమన్నారని తెలిపారు. ‘మా’ ఎన్నికల అధికారితోనే తమకు ప్రధాన సమస్య అని చెప్పారు.
ఈనెల 10న ‘మా’ ఎన్నికలు జరిగాయి. ఓటింగ్ సందర్భంగా పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో విజయంపై మొదటి నుంచి ధీమాగా ఉన్న ప్రకాశ్.. మంచు విష్ణు చేతిలో ఓడిపోయారు. దీంతో ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచినవారు తమ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఎన్నికల రోజు తమ టీమ్ మెంబర్స్ను అసభ్య పదజాలంతో దూషించారని ప్రకాశ్ రాజ్ ఆరోపించారు. ఆ రోజు జరిగిన పరిణామాలను తలచుకొని బెనర్జీ, తనీష్ కంటతడిపెట్టారు.
ఇక ఈ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని ప్రకాశ్ రాజ్ వర్గం తీవ్రంగా విమర్శిస్తున్నది. బ్యాలెట్ పత్రాలు ఇంటికి తీసుకెళ్లారని, రాత్రి గెలిచినవాళ్లు తెల్లారేసరికి ఎలా ఓడిపోయారని ప్రశ్నిస్తున్నారు. పోలింగ్ కేంద్రంలో జరిగిన రచ్చ గురించి ప్రజలందరికీ తెలియాలని, సీసీ ఫుటేజీ ఇవ్వాలని ఎన్నికల అధికారులను ప్రకాశ్ రాజ్ ఇప్పటికే కోరారు.