Rebel Star Prabhas | ప్రస్తుతం సోషల్ మీడియాలో రెబల్ స్టార్ ప్రభాస్ మరియు మలయాళ సెన్సేషనల్ డైరెక్టర్ దిన్జిత్ అయ్యతాన్ కలిసి ఉన్న ఒక ఫోటో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫోటో వీరిద్దరి కాంబినేషన్లో ఒక భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతుందనే వార్తలకు బలం చేకురుస్తుంది. ఇటీవల ‘కిష్కింధ కాండం’ మరియు ‘ఏకో’ వంటి విభిన్నమైన సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన దిన్జిత్, స్వయంగా ప్రభాస్ను కలిసిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రభాస్ ఆతిథ్యాన్ని, ముఖ్యంగా ఆయన వడ్డించిన రుచికరమైన ‘ప్రాన్స్ బిర్యానీ’ని ప్రశంసిస్తూ దిన్జిత్ పెట్టిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.
ముఖ్యంగా ఈ సమావేశం వెనుక హోంబలే ఫిల్మ్స్ అధినేత విజయ్ కిరగందూర్ ఉండటం గమనార్హం. గతంలోనే హోంబలే సంస్థ ప్రభాస్తో మూడు సినిమాల భారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో ‘సలార్ 2’ కాకుండా, మిగిలిన రెండు చిత్రాల్లో ఒకటి దిన్జిత్ దర్శకత్వంలో ఉండే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ టాక్ నడుస్తుంది. విలక్షణమైన థ్రిల్లర్లను తెరకెక్కించడంలో దిన్జిత్ సిద్ధహస్తుడు కావడంతో, ప్రభాస్ ఇమేజ్కు తగ్గట్టుగా ఒక సరికొత్త తరహా కథను ఆయన సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం ప్రభాస్ ‘ఫౌజీ’, ‘స్పిరిట్’ మరియు ‘కల్కి 2’ వంటి భారీ ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ క్రేజీ కాంబో ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అధికారిక ప్రకటన రానప్పటికీ, ఈ ఇద్దరి కలయికతో ఒక డిఫరెంట్ సినిమాను చూడవచ్చని అభిమానులు ఆశిస్తున్నారు.