‘సినిమా పరాజయం పాలైతే చాలా బాధగా ఉంటుంది. అయితే మన ప్రతిభకు విజయం ఒక్కటే కొలమానం కాదు’ అని చెప్పింది అగ్ర కథానాయిక పూజాహెగ్డే. బాలీవుడ్ చిత్రసీమలో ఈ భామకు ఆశించిన విజయాలు దక్కడం లేదు. ‘మొహెంజో దారో చిత్రంతో ఆరేండ్ల క్రితం బాలీవుడ్లో అడుగుపెట్టిన ఈ మంగళూరు సోయగానికి ఇప్పటివరకు అక్కడ బ్రేక్ లభించలేదు. ఇటీవలే విడుదలైన ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తారు వసూళ్లను సాధించింది.
ఈ విషయం గురించి పూజాహెగ్డే మాట్లాడుతూ ‘ప్రతి సినిమాకు నేను అంకితభావంతో కష్టపడతాను. నేను తీసుకునే పారితోషికానికి న్యాయం చేసే ప్రయత్నం చేస్తాను. అయితే ఒక్కోసారి మన అంచనాలు తప్పుతాయి. అందుకు బాధపడి ప్రయోజనం లేదు. చేసే పనిలో వందశాతం నిజాయితీ కనబరచడమే అసలైన విజయమని నమ్ముతాను. జయాపజయాల గురించి పెద్దగా ఆలోచించను. విజయం కంటే పనిలో నిబద్దతే చాలా ముఖ్యం’ అని చెప్పింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో మహేష్బాబు-త్రివిక్రమ్ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నది.