నటీనటులు : విక్రమ్, ఐశ్వర్యరాయ్, కార్తి, త్రిష, జయం రవి, శరత్కుమార్, ప్రకాష్ రాజ్, జయరామ్, ఐశ్వర్య లక్ష్మి తదితరులు
సాంకేతిక నిపుణులు : సినిమాటోగ్రఫీ – రవి వర్మన్, ఎడిటింగ్ – శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైన్ – తోట తరణి, సంగీతం – ఏఆర్ రెహమాన్, నిర్మాణ సంస్థలు – మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్, దర్శకత్వం – మణిరత్నం.
చారిత్రక నేపథ్య నవల పొన్నియన్ సెల్వన్ ఆధారంగా అదే పేరుతో రెండు భాగాలుగా సినిమాను రూపొందించారు దర్శకుడు మణిరత్నం. ప్రముఖ నటీనటులు ప్రధాన పాత్రల్లో కనిపించడం, భారీ నిర్మాణ విలువలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. మనకే కాదు తమిళనాటే చాలా మందికి తెలియని చారిత్రక కథ ఇది. ఈ కథను దర్శకుడు మణిరత్నం ఆకట్టుకునేలా తెరకెక్కించాడా? లేదా? రివ్యూలో చూద్దాం
చోళ సామ్రాజ్య చక్రవర్తి సుందర చోళుడి (ప్రకాష్ రాజ్)కి ఇద్దరు కొడుకులు ఆదిత్య కరికాలన్ (విక్రమ్), అరణ్మొళి వర్మ (పొన్నియన్ సెల్వన్) (జయం రవి), ఒక కుమార్తె కుందవై (త్రిష) ఉంటారు. ఆదిత్య కరికాలన్ యుద్ధ వీరుడిగా చోళ సైన్యాన్ని విజయాలతో ముందుకు నడిపిస్తుంటాడు. పాండ్యులను, రాష్ట్రకూట రాజులను యుద్ధంలో ఓడిస్తాడు. యుద్ధంలో గాయపడిన వీరపాండ్య రాజును ఒక ఇంట్లోకి తీసుకెళ్లి సపర్యలు చేసి కాపాడే ప్రయత్నం చేస్తుంది నందినీ(ఐశ్వర్యరాయ్). ఈ నందినీ ఆదిత్య గతంలో ప్రేమించిన అమ్మాయి. శత్రువుకు తన ప్రేయసి సపర్యలు చేయడం ఆదిత్య కరికాలన్ సహించలేకపోతాడు. ఆ ఇంట్లోకి వచ్చి వీర పాండ్యరాజును చంపవద్దని నందినీ వేడుకుంటున్నా..అతన్ని వధిస్తాడు. దీంతో ఆదిత్య కరికాలన్పై పగ పెంచుకున్న నందినీ అతని సామంతుడు, తంజావురు రాజైన పళువెట్టరాయ (శరత్ కుమార్)ను పెళ్లి చేసుకుంటుంది. సుందర చోళుడి సోదరుడి కుమారుడైన మధురాంతకుడు (రెహమాన్)ని రాజును చేయాలని పళువెట్టరాయ సారథ్యంలో సామంతులు కుట్ర చేస్తుంటారు. మరోవైపు పాండ్య రాజ్యంలో మిగిలిన సైనికులు చోళ యువ రాజులైన ఆదిత్య కరికాలన్, అరణ్మొళి వర్మలను చంపేందుకు ప్రయత్నిస్తుంటారు. వేగుల ద్వారా సామంతుల కుట్ర విషయం తెలుసుకున్న ఆదిత్య కరికాలన్ తన మిత్రుడు వల్లవరాయ వందియదేవుడు (కార్తి)ని ద్వారా రహస్య లేఖలను తంజావూరులో ఉన్న తండ్రి సుందర చోళుడికి, పళయారైలో ఉన్న కుందవై, అరణ్మొళి వర్మలకి పంపిస్తాడు. రాజ కుటుంబంపై కుట్ర మొదలైందని తెలిసిన కుందవై తంజావూరు వచ్చి సామంత రాజుల్లో ఐక్యత లేకుండా చేసే ఉపాయాలు పన్నుతుంటుంది. అరణ్మొళి వర్మను కూడా పళయారై నుంచి తంజావూరు రప్పించేందుకు కుట్రదారులు పథకాలు వేస్తారు. ఒకవైపు మధురాంతకుడిని బలపరిచే సామంత రాజుల కుట్ర, మరోవైపు అంతపురంలోనే ఉంటూ పగ సాధించాలని నందినీ ప్రయత్నాలు, ఇంకోవైపు ప్రతీకారం కోసం చూస్తున్న పాండ్యరాజు సైనికులు…వీళ్లందరి పన్నాగాల నుంచి రాజ కుటుంబం ఎలా బయటపడింది అనేది మిగిలిన కథ.
ఫ్లస్ పాయింట్స్ : సినిమాలోని భారీతనం, నటీనటుల ప్రతిభ
మైనస్ పాయింట్స్ : నెమ్మదిగా సాగే కథనం, పండని భావోద్వేగాలు
చాలా విస్తృతమైన చారిత్రక నేపథ్య కథ ఇది. కథలోని వీరత్వం, కుట్ర కోణం, భావోద్వేగాలు దర్శకుడిని సినిమా రూపొందించేందుకు పురికొల్పి ఉంటాయి. చిరంజీవి వాయిస్ ఓవర్తో క్లుప్తంగా కథను వివరిస్తూ సినిమా ప్రారంభమవుతుంది. ఆదిత్య కరికాలన్ పరాక్రమం చూపించే యుద్ధ సన్నివేశాలు, అతనికి సహాయపడే వందియదేవుడి వీరత్వంతో సినిమా వేగంగా టేకాఫ్ అవుతుంది. వందియదేవుడిని ఆదిత్య కరికాలన్ తన పని మీద వివిధ ప్రాంతాలకు పంపినప్పటి నుంచి కథ నెమ్మదిస్తుంది. అనుమతి లేని కోటల్లోకి ఉపాయంగా అతను వెళ్లడం, రహస్య లేఖలను చేరవేసే క్రమంలోనూ సన్నివేశాలు అనాసక్తిగా సాగుతాయి. వినోదం కోసం అళ్వార్ కడియన్ నంబి (జయరాం)ను తోడుగా పెట్టుకున్నా, అది అక్కడక్కడ మాత్రమే వర్కవుట్ అయ్యింది.
ఇది తొలి భాగం సినిమా కాబట్టి కథను చాలా వరకు పాత్రలను పరిచయం చేసేందుకే దర్శకుడు ఉపయోగించుకున్నాడు. పొన్నియన్ సెల్వన్ నవలను ఒక్కోటి గంట చొప్పున పది ఎపిసోడ్స్తో వెబ్ సిరీస్ చేస్తానని ఆ మధ్య నాగార్జున అన్నట్లు ఇది వెబ్ సిరీస్ చేసినా బాగుండేదేమో. ఇలా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, వాటి మధ్య సంఘర్షణ ఇది, అవి ఎదుర్కొనే సమస్యలు ఇవీ అని చెప్పే వరకే తొలి భాగం సినిమా పూర్తవుతుంది. మంచి ఎమోషన్, హీరోయిజం ఉన్న కథను అంతే ఆకట్టుకునేలా తెరకెక్కించలేకపోయారు దర్శకుడు మణిరత్నం. ప్రేక్షకులకు కావాల్సినరీతిలో సన్నివేశాలు, పాటలు ఉండవు. ఉన్న రెండు మూడు పాటలకు పౌరాణిక నేపథ్యాలు ఎంచుకున్నారు. స్టార్ కాస్టింగ్, మేకింగ్ వ్యాల్యూస్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అయ్యాయి. విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తీ..వీళ్లంతా ఆయా పాత్రలకు వన్నె తీసుకొచ్చారు. అతి సాధారణ సన్నివేశాలు కూడా చూసేలా చేశాయంటే కారణం వీళ్ల స్క్రీన్ ప్రెజెన్స్. ఆదిత్య కరికాలన్గా విక్రమ్, నందినీగా ఐశ్వర్యరాయ్, వందియదేవుడిగా కార్తీ, కుందవై పాత్రలో త్రిష, అరణ్మొళి వర్మగా జయం రవి తమ తమ పాత్రల్లోకి మారిపోయారు.
తోట తరణి ప్రొడక్షన్ డిజైనింగ్లో భారీతనం కనిపించింది. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ ఉన్నతంగా ఉంది. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ను ఈ తొలి భాగం సినిమా ఏమాత్రం ఉపయోగించుకోలేకపోయింది. పాటల్లో గానీ నేపథ్య సంగీతంలో గానీ రెహమాన్ ప్రభావం కనిపించలేదు. ఈ కథకు ఇంతే కావాలని అనుకున్నారేమో తెలియదు. పొన్నియన్ సెల్వన్ 1 ఇండియన్ స్క్రీన్పై ఒక భారీ ప్రయత్నమే అయినా కథలోని ఉద్వేగాన్ని ప్రేక్షకులకు అందించలేకపోయిందనే చెప్పాలి.
రేటింగ్ 2.25/5