శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ ఉపశీర్షిక. సాయికిరణ్ దైదా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 15న విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి మాట్లాడుతూ ‘నాకు అమెరికాలో ఐటీ కంపెనీలు ఉన్నాయి. సినిమా చేయాలనే పాషన్ ఎప్పటి నుంచో ఉంది. మంచి కథతో సినిమా చేద్దామనుకుంటున్న సమయంలో దర్శకుడు ఈ కథ చెప్పాడు.
వారం రోజుల్లో కథ పూర్తి చేసి ‘పిండం’ అనే టైటిల్ పెట్టాం. టైటిల్ తొలుత మాకే ఆశ్చర్యంగా అనిపించింది. అయితే పిండం నుంచే జీవి ఉద్భవిస్తుంది. మరణం తర్వాత కూడా పిండమే పెడతారు. అందుకే ఈ టైటిల్ పెట్టడంలో తప్పు లేదనిపించింది. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకు కూడా టైటిల్ జస్టిఫికేషన్ దొరుకుతుంది. మూడు కాల వ్యవధుల్లో నడిచే కథ ఇది.
మిగతా హారర్ చిత్రాలతో పోల్చితే చాలా భిన్నంగా ఉంటుంది. తెలుగులో ఈ తరహా కథ రావడం ఇదే మొదటిసారి. సినిమా షూటింగ్ సందర్భంగా కొన్ని అనూహ్య సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఒకరు ఫిట్స్ వచ్చి పడిపోయారు. ఒకసారి సెట్లోకి పాము వచ్చింది. ఓసారి అమావాస్య అర్థరాత్రి రోజున షూటింగ్ జరుగుతుంటే అందరూ భయపడ్డారు. అప్పుడు దగ్గరలోని గుడి నుంచి కుంకుమ తెప్పించి అందరికి బొట్లు పెట్టించాం. మేము అనుకున్న దానికంటే సినిమా బాగా వచ్చింది. ట్రైలర్ చూసి ఎంతో మంది డిస్ట్రిబ్యూటర్స్ మమ్మల్ని సంప్రదించారు. భవిష్యత్తులో కూడా మంచి కథల్ని ఎంచుకొని నిర్మాతగా నా ప్రయాణం కొనసాగిస్తాను’ అన్నారు.