Pawan Kalyan | తెలుగు రాష్ట్రాల్లో ‘పవన్ కళ్యాణ్’ అనే పేరు ఒక సాధారణ పేరు కాదు.. కోట్లాది మంది అభిమానులకు అదొక భావోద్వేగం. వెండితెరపై ఆయన కనిపిస్తే థియేటర్లు దద్దరిల్లుతాయి. ప్రజాక్షేత్రంలో ఆయన గొంతు వినిపిస్తే అభిమానుల్లో, జనసైనికుల్లో పోరాట స్ఫూర్తి రగులుతుంది. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్.. తనదైన స్టైల్, మేనరిజం, వ్యక్తిత్వంతో కొద్దికాలంలోనే ప్రత్యేకమైన స్టార్డమ్ను సొంతం చేసుకున్నారు. ఒకవైపు నటుడిగా అగ్రస్థానంలో ఉన్న సమయంలోనే ప్రజాసేవ వైపు అడుగులు వేశారు. రాజకీయాల్లో ఎన్నో అవమానాలు, విమర్శలు, ఓటములు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. దాదాపు దశాబ్దం పాటు ఎదురుచూసిన తర్వాత 2024 ఎన్నికల్లో జనసేనను విజయపథంలో నడిపించి.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ, రాజకీయ ప్రస్థానం చూద్దాం..
1971 సెప్టెంబర్ 2న కొణిదెల వెంకట్రావు, అంజనా దేవి దంపతులకు బాపట్లలో మూడో కుమారుడిగా పవన్ కళ్యాణ్ జన్మించారు. తల్లిదండ్రులు ఆయనకు ‘కళ్యాణ్ కుమార్’ అని పేరు పెట్టారు. కుటుంబంలో అందరికంటే చిన్నవాడు కావడంతో చిన్ననాటి నుంచే ‘కళ్యాణ్ బాబు’గా పిలుచుకునేవారు. తండ్రి ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాలకు బదిలీ కావడంతో చిన్నతనంలోనే ఆయన రాష్ట్రంలోని భిన్న ప్రాంతాల యాసలు, సంస్కృతులు, ప్రజల జీవన విధానాన్ని దగ్గరగా గమనించే అవకాశం దక్కింది. చిన్ననాటి అనుభవాలు, సామాన్య ప్రజల కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఆయనపై ఎంతో ప్రభావం చూపించాయని పలుమార్లు చెప్పుకొచ్చారు.
1996లో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో పవన్ కళ్యాణ్ సినీ రంగ ప్రవేశం చేశారు. మార్షల్ ఆర్ట్స్పై ఉన్న ఆసక్తితో కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన ఆయన.. తన యాక్షన్ నైపుణ్యాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం ‘పవన్ కళ్యాణ్’గా ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఆ సమయంలో స్టార్ హీరోల హవా కొనసాగుతున్నప్పటికీ.. పవన్ తనదైన స్టైల్, యాటిట్యూడ్, మేనరిజంతో యువతలో ప్రత్యేకమైన క్రేజ్ను సంపాదించుకున్నారు. ‘సుస్వాగతం’, ‘తొలిప్రేమ’, ‘తమ్ముడు’, ‘బద్రి’, ‘ఖుషీ’ వంటి సినిమాలతో వరుస విజయాలు అందుకుని యూత్ ఐకాన్గా ఎదిగారు. కేవలం నటుడిగానే కాకుండా మార్షల్ ఆర్ట్స్, కొరియోగ్రఫీ, స్క్రీన్ప్లే, దర్శకత్వం, గానం, నిర్మాణం వంటి విభాగాల్లోనూ తన ప్రతిభను చాటుకున్నారు. ‘గబ్బర్ సింగ్’, ‘అత్తారింటికి దారేది’ వంటి బ్లాక్బస్టర్ చిత్రాలతో తన స్టార్డమ్ను మరో స్థాయికి తీసుకెళ్లారు.
2008లో అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అయితే ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం కావడం ఆయనను తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో ప్రజా సమస్యలపై ప్రశ్నించే రాజకీయాలే లక్ష్యంగా 2014 మార్చిలో జనసేన పార్టీని స్థాపించారు. అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో స్వయంగా పోటీ చేయకుండా టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చారు. ప్రభుత్వ ఏర్పాటులో తన వంతు పాత్ర పోషించారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక నియోజకవర్గాల నుంచి పోటీ చేసినప్పటికీ రెండు చోట్లా ఓటమి ఎదురైంది.
ఈ ఓటమి తర్వాత ప్రత్యర్థుల నుంచి తీవ్ర విమర్శలు, వ్యక్తిగత విమర్శలు ఎదురైనా పవన్ కళ్యాణ్ రాజకీయంగా వెనక్కి తగ్గలేదు. 2019 నుంచి 2024 వరకు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ పార్టీ శ్రేణుల్లో నమ్మకాన్ని పెంచారు.ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే లక్ష్యంతో టీడీపీ, బీజేపీలతో కలిసి కూటమిని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించిన ఆయన.. జనసేన పోటీ చేసిన మొత్తం 21 అసెంబ్లీ స్థానాల్లోనూ అభ్యర్థులను గెలిపించారు. అలాగే పోటీ చేసిన రెండు లోక్సభ స్థానాల్లోనూ విజయం సాధించింది. దీంతో జనసేన పార్టీ 100 శాతం స్ట్రైక్ రేట్ నమోదు చేసింది. ఎన్నో ఏళ్ల పాటు ఎదురైన విమర్శలు, అవమానాలు, ఓటములకు సమాధానంగా ఈ విజయం నిలిచింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి శాఖలను నిర్వహిస్తున్నారు.గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం, గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, రహదారులు, విద్యుత్ సౌకర్యాలు, పారిశుధ్యం, అటవీ సంపద పరిరక్షణ వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. ఒకే రోజున రాష్ట్రవ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించడం కూడా ఆయన రాజకీయ ప్రయాణంలో ప్రత్యేకంగా నిలిచిన అంశాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు.
వెండితెరపై ‘పవర్ స్టార్’గా అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న పవన్ కళ్యాణ్.. రాజకీయాల్లో ‘జనసేనాని’గా తనదైన ముద్ర వేస్తున్నారు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, జనసైనికులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.