పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయన కొద్ది రోజులుగా తన ఫాం హౌజ్లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఆయన కోలుకున్న విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. కరోనా బారిన పడిన పవన్ కళ్యాణ్కి వైద్య సేవలు అందించిన డాక్టర్స్ మూడు రోజుల కిందట ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షలలో నెగెటివ్ వచ్చింది. కరోనా అనంతరం వచ్చే నిస్త్రాణం వంటివి మాత్రం ఉన్నాయని, ఆరోగ్యపరంగా పవన్ కళ్యాణ్కి ఇబ్బందులు లేవని వైద్యులు తెలిపినట్టు జనసేన ప్రకటించింది.
తన ఆరోగ్యక్షేమాల కోసం ఆకాంక్షించిన వారికి, పూజలు, ప్రార్ధనలు చేసిన జనసైనికులు, నాయకులు, అభిమానులకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం దేశంలో కోవిడ్ ప్రభావ తీవ్ర స్థాయిలో ఉన్నందున ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు పాటించాలని, వైద్య నిపుణులు అందిస్తున్న సూచనలు అనుసరించాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.