దేశీయ బాక్సాఫీస్ వద్ద షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ సినిమా సందడి చేస్తున్నది. బుధవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రానికి తొలి ఆట నుంచే స్పందన బాగుండటంతో ఇప్పుడున్న వాటికి మరో 300 స్క్రీన్స్ పెంచారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా 8 వేల స్క్రీన్స్లో షారుఖ్ హంగామా చేస్తున్నారు. ఐదున్నర లక్షల టికెట్ల అమ్మకంతో అడ్వాన్స్ బుకింగ్స్లో రికార్డులు సృష్టించిన ఈ సినిమా తొలి రోజు వసూళ్లలోనూ అదే జోరు చూపిస్తున్నది. నూన్ షోస్ ముగిసేసరికి ‘పఠాన్’ దేశవ్యాప్తంగా 20 కోట్ల రూపాయలకు పైగా బాక్సాఫీస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ జోరు కొనసాగితే ఈ సినిమా వసూళ్లలో చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తున్నది.
నాలుగేండ్ల విరామం తర్వాత షారుఖ్ ఖాన్ తెరపైకి రావడం సినిమాపై భారీ క్రేజ్ తీసుకొచ్చింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్లో గూఢచారి పాత్రలో షారుఖ్ నటించారు. ఆయన సహచర స్పై క్యారెక్టర్ను దీపికా పడుకోన్ పోషించింది. జాన్ అబ్రహాం ప్రతినాయకుడిగా నటించారు. ఇటీవల వరుస అపజయాలతో ఢీలా పడిన ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్కు ఈ చిత్రం ఊరటనిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.