Pathan Movie Row | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కమ్ బ్యాక్ మూవీ పఠాన్. చిత్రంలోని ‘బేషరమ్ రంగ్’ పాట విడుదలైనప్పటి నుంచి వివాదం మొదలైంది. రోజు రోజుకు విమర్శలు వ్యక్తమవుతున్నాయే తప్పా ఏ మాత్రం తగ్గడం లేదు. గతంలో దీపికా ధరించిన కాషాయ రంగు బికినీపై దుమారం చెలరేగింది. సినిమాలో కాషాయ రంగును మార్చాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. పలు హిందూ సంఘాలతో పాటు ముస్లిం సంఘాలు సంఘాలు సినిమాను బ్యాన్ చేయాల్సిందేనని పట్టుబడుతున్నాయి.
తాజాగా వివాదం జాతీయ మానవ హక్కుల కమిషన్ వరకు వెళ్లింది. ఆర్టీఐ కార్యకర్త డానిష్ ఖాన్ ‘బేషరమ్ రంగ్’పై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. పాటను సినిమా నుంచి తొలగించేలా ఆదేశించాలని కోరారు. కాషాయ రంగుకు ముస్లిం సమాజంలో ఎంతో ప్రాధాన్యం ఉందని పేర్కొన్నారు. ఇది ముస్లిం సమాజానికి చిస్తీ రంగని తెలిపారు. పాట సైతం హిందూ – హుస్లింల ఐక్యత, మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
పఠాన్ సినిమాపై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీపికా కాషాయ రంగు బికినీ ధరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత విశ్వహిందూ పరిషత్, వీర్ శివాజీ గ్రూప్లు సైతం అసంతృప్తి వ్యక్తం చేశాయి. తాజాగా ముస్లిం సమాజం సైతం వ్యతిరేకిస్తున్నది. ఇదిలా ఉండగా.. దాదాపు ఏడేళ్ల తర్వాత షారుఖ్ ఖాన్ నటిస్తున్న చిత్రం పఠాన్. షారుఖ్కు జోడీగా దీపికా పదుకునే నటిస్తున్నది. జాన్ అబ్రహం సైతం కీలకపాత్ర పోషిస్తున్నాడు. అయితే, వచ్చే ఏడాది జనవరి 25న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.