Raghav-Parineeti | ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా, బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా త్వరలో పెళ్లి పీటలక్కనున్నారు. ఇందులో భాగంగానే త్వరలో ఎంగేజ్మెంట్ సైతం చేసుకోనున్నట్లు సమాచారం. ఇద్దరు గతకొంతకాలంగా డేటింగ్లో ఉన్నట్లు ప్రచారం బాలీవుడ్ కోడై కూస్తున్నది. పలుమార్లు ఇద్దరు చట్టాపట్టాలేసుకొని తిరుగుతూ కెమెరాలకు చిక్కారు. ముంబయిలో ఇద్దరు వరుసగా లంచ్, డిన్నర్కు వెళ్తూ కనిపించారు. ఆ తర్వాత ఇద్దరు చాలాసార్లు విమానాశ్రయంలో కెమెరాలకు చిక్కారు.
ఇటీవల విమానాశ్రయంలో పరిణీతిని రిసీవ్ చేసుకునేందుకు రాఘవ్ చద్దా ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు ఇద్దరిలో ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు.. అ సమయంలో ఖండించనూ లేదు. దాంతో పెళ్లి వార్తలు నిజమేనంటున్నారు. ఇటీవల ఆప్ నేత సంజీవ్ అరోరాతో పాటు సింగర్ హర్డీ సంధు సైతం రాఘవ్ చద్దాతో పాటు పరిణీతి చోప్రాకు శుభాకాంక్షలు తెలిపారు. దాంతో ఇద్దరు పెళ్లి
చేసుకోబోతున్నారనే వార్తలకు మరింత బలం చేకూరింది. పరిణీతి ఢిల్లీ విమానాశ్రయంలో కనిపించిన సందర్భంలో రాఘవ్ చద్దాతో పెళ్లి వార్తలపై ఫొటోగ్రాఫర్లు ప్రశ్నించారు.
దానికి పరిణీతి సిగ్గుపడుతూ ఏమీ చెప్పకుండా.. గుడ్నైట్ చెబుతూ వెళ్లిపోయింది. అలాగే ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రాను సైతం కలిసింది. ఎంగేజ్మెంట్, పెళ్లి కోసం ప్రత్యేకంగా డ్రెస్ డిజైన్ కోసం కలిసినట్లుగా ప్రచారం జరిగింది. తాజాగా మరోసారి పెళ్లికి ముందు త్వరలో నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లుగా సమాచారం. సమాచారం ప్రకారం.. ఈ నెల 10న ఢిల్లీలో ఈ వేడుక జరుగనున్నట్లు తెలుస్తున్నది. ఈ వేడుకకు ఇరు కుటుంబాలతో పాటు దగ్గరి మిత్రులకు మాత్రమే ఆహ్వానించనున్నట్లు తెలిసింది. కార్యక్రమం కోసమే పరిణీతి సోదరి ప్రియాంక చోప్రా సైతం భారత్లో ఉన్నట్లుగా సమాచారం. మరి ఇందులో వాస్తవమెంతో వేచి చూడాల్సిందే.