జీవితంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని అంటున్నది బాలీవుడ్ తార పరిణితి చోప్రా. జాగ్రత్తగా అడుగులు వేయడం ప్రతిరోజూ ముఖ్యమేనని ఆమె చెబుతున్నది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న క్రేజీ ఫిల్మ్ ‘యానిమల్’లో నాయికగా నటించే అవకాశం మొదట పరిణితికే వచ్చింది. అయితే ఈ సినిమాను మరో ఆలోచన లేకుండా వదులుకుందీ భామ. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ…‘సరైన నిర్ణయాలే రేపటిని నిర్దేశిస్తాయి. అంగీకార, తిరస్కారాలు జీవితంలో భాగమే. కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తప్పవు. యానిమల్ చేసే సమయానికి నా దగ్గరకు వచ్చిన మిగతా ప్రాజెక్ట్స్ ఉత్తమం అనిపించాయి. గత కొద్దికాలంగా నేను వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ పేరు తెచ్చుకుంటున్నాను. నేను ఇలాంటి పాత్రల్లో కూడా నటించగలనా అని ప్రేక్షకులు ఆశ్చర్యపడుతున్నారు. వారు నాపై పెట్టుకున్న ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ఇకపైనా అలాంటి చిత్రాలే చేస్తాను’ అని చెప్పింది. పరిణితి నటించిన కొత్త సినిమా ‘కోడ్ నేమ్ తిరంగా’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.