Parineeti Chopra | బాలీవుడ్ తార పరిణీతి చోప్రా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనుందనే వార్తలు ప్రచారమవుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చద్దాతో ఆమె వివాహం జరగనుంది. ఇప్పటికే సంప్రదాయ రోకా కార్యక్రమం నిర్వహించినట్లు తెలుస్తున్నది. మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడుతున్నాం అని తమ కుటుంబాల ముందు అంగీకరించడమే ఈ రోకా వేడుక. అక్టోబర్లో పరిణీతి, రాఘవ్ పెండ్లి జరపనున్నారట. ఈ విషయాన్ని నాయిక సన్నిహితులు చెబుతున్నారు.
వారు మాట్లాడుతూ…‘వెంటనే పెండ్లి చేసుకోవాలనే తొందరలో పరిణీతి, రాఘవ్ లేరు. ఇటీవలే వారి రోకా వేడుక నిర్వహించారు. అక్టోబర్లో వివాహం జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈలోగా వారికున్న వృత్తిపరమైన పనులు పూర్తి చేసుకునే సమయం లభిస్తుంది’ అని చెప్పారు. ‘లేడీల్ వర్సెస్ రికీ బాల్’, ‘ఇష్కియా జాదే’, ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’, ‘హసీతో ఫసీ’ వంటి చిత్రాలతో నాయికగా గుర్తింపు తెచ్చుకుంది పరిణీతి. ప్రస్తుతం ఆమె ఖాతాలో ‘ఛమ్కీలా’, ‘క్యాప్సూల్ గిల్’ వంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి.