తిరువీర్, పావని కరణం, బన్నీ అభిరన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పరేషాన్’. రూపక్ రోనాల్డ్సన్ దర్శకుడు. ఈ సినిమాకు హీరో రానా సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. విశ్వతేజ్ రాచకొండ, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మాతలు. జూన్ 2న సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ చిత్రం విడుదల కానుంది. ఆదివారం థియేట్రికల్ ట్రైలర్ను ఆవిష్కరించారు. రానా మాట్లాడుతూ ‘ఈ సినిమా చూసి పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నా. తిరువీర్ ‘ఘాజీ’ సినిమాలో నాతో కలిసి నటించాడు.
ఈ సినిమాలో నేనూ భాగమైనందుకు గర్వంగా ఉంది’ అన్నారు. ‘దర్శకుడు రూపక్ రోనాల్డ్సన్ మంచిర్యాలలో పుట్టి పెరిగి అక్కడే ఈ కథ రాసుకున్నాడు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మనసారా నవ్వుకున్నామని చెబుతున్నారు. ఈ సినిమాలో చాలా మంది కొత్తవారు నటించారు’ అని హీరో తిరువీర్ చెప్పారు. అల్లరి చిల్లరగా తిరిగే కొంత మంది యువకుల జీవితంలో చోటుచేసుకునే అనూహ్య సంఘటనల నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతుందని దర్శకుడు తెలిపారు.