PV Narasimha Rao | భారత మాజీ ప్రధాని, బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆర్థిక సంస్కరణలతో నవభారత రూపశిల్పిగా వినుతికెక్కిన పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన జీవిత చరిత్ర వెబ్సిరీస్గా రానుంది. ఆహా స్టూడియో, అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు పీవీ నరసింహారావు బయోపిక్ ‘హాఫ్ లయన్’ను తెరకెక్కిస్తున్నట్లు గతంలోనే ప్రకటించాయి. ఇటీవల పీవీకి భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో ఈ సిరీస్పై మరింత కసరత్తులు చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.
ప్రముఖ రచయిత వినయ్ సీతాపతి రచించిన ‘హాఫ్ లయన్’ పుస్తకం ఆధారంగా, సీనియర్ దర్శకుడు ప్రకాష్ ఝా ఈ సిరీస్ను రూపొందించబోతున్నారు. ఈ పాన్ ఇండియా సిరీస్ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని, హిందీ..తెలుగు భాషల్లో విడుదల చేయబోతున్నామని, పీవీ నరసింహారావు జీవనయానాన్ని ఈ సిరీస్లో కళ్లకు కట్టినట్లుగా చూపించబోతున్నామని దర్శకుడు తెలిపారు. ఈ సిరీస్కు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించబోతున్నారు.