ప్రతిష్టాత్మక ఆస్కార్ పురస్కారాల కోసం నామినేషన్స్కు అర్హత సాధించిన చిత్రాల జాబితాను ఆస్కార్ అవార్డుల కమిటీ వెల్లడించింది. 95వ ఆస్కార్ పురస్కారాల కోసం ప్రపంచవ్యాప్తంగా 301 సినిమాలు పోటీపడుతున్నాయి. ఇందులో భారత్ నుంచి పది చిత్రాలు రేసులో నిలిచాయి. మన దేశం నుంచి గుజరాతీ చిత్రం ‘ఛల్లో షో’ ఆస్కార్ అధికారిక ఎంట్రీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు ఆర్ఆర్ఆర్, కాంతార, గంగూభాయి కతియావాడి, విక్రాంత్ రోణ, రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్, మి వసంతరావ్, తుజ్యా సాథీ కహీ హై, ఇరవిన్ నిళల్ చిత్రాలు ఓపెన్ కేటగిరిలో బరిలో నిలిచాయి.
‘కాంతార’ సినిమా ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు విభాగాల్లో ఆస్కార్ నామినేషన్లకు అర్హత సాధించిందని నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ పేర్కొంది. కొద్దిరోజుల క్రితమే ఆస్కార్ అవార్డుల్లో పోటీ పడే చిత్రాల షార్ట్లిస్ట్ను ప్రకటించారు. ఇందులో నాలుగు విభాగాల్లో భారతీయ సినిమాలు స్థానం దక్కించుకున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం నుంచి ‘నాటు నాటు…’పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో పోటీపడబోతున్న విషయం తెలిసిందే. ఆస్కార్ బరిలో నిలిచిన సినిమాల తుది జాబితాను ఈ నెల 24న ప్రకటించబోతున్నారు. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 12న లాస్ ఏంజిలస్లోని డాల్బీ థియేటర్లో జరగనుంది.