‘ఓరి దేవుడా’ చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేస్తున్నారు కథానాయికలు మిథిలా పాల్కర్, ఆశాభట్. తమిళ చిత్రం ‘ఓ మై కడవులే’కు రీమేక్ ఇది. విశ్వక్సేన్ కథానాయకుడిగా అశ్వథ్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 21న ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మిథిలా పాల్కర్ మాట్లాడుతూ ‘స్నేహం, ప్రేమ, పెళ్లి అంశాల చుట్టూ తిరిగే కథ ఇది. ఈ సినిమాలో నా పాత్ర పేరు అను. నా నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది.
తెలుగు నేటివిటీకి అనుగుణంగా దర్శకుడు ఈ కథను తీర్చిదిద్దారు. నేను గతంలో వెబ్ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్నా. ఈ సినిమా తెలుగులో నాకు శుభారంభాన్నిస్తుందన్న నమ్మకం ఉంది’ అని చెప్పింది. ఆశాభట్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నేను మీరా అనే అసిస్టెంట్ దర్శకురాలి పాత్రలో కనిపిస్తా. నాకు నృత్యంలో మంచి ప్రావీణ్యం ఉంది. అందుకు అనుగుణంగానే దర్శకుడు నా పాత్రను డిజైన్ చేశారు. నేను కన్నడ అమ్మాయిని కాబట్టి తెలుగు అర్థం చేసుకోవడం పెద్ద ఇబ్బందిగా అనిపించలేదు’ అని చెప్పింది.