ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో అచ్చ తెలుగు అందం శ్రీలీల జోరు కొనసాగుతున్నది. దాదాపు అరడజను చిత్రాల్లో ఈ భామ కథానాయికగా నటిస్తున్నది. అరంగేట్రం చేసిన అనతికాలంలోనే వరుస అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ ఈ సొగసరి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. ‘పెళ్లి సందడి’ చిత్రంతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఆమెకు ‘ధమాకా’ చిత్రం కమర్షియల్గా మంచి బ్రేక్ నిచ్చింది. అక్కడి నుంచి ఈ అమ్మడు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.
ఈ నేపథ్యంలో శ్రీలీల మరోమారు రవితేజతో జోడీ కట్టనుందని సమాచారం. వివరాల్లోకి వెళితే… రవితేజ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నది. ఇందులో శ్రీలీలను కథానాయికగా ఖరారు చేశారని తెలిసింది. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్మీదకు వెళ్లనుందని చెబుతున్నారు. ప్రస్తుతం గుంటూరు కారం, భగవంత్ కేసరి, ఉస్తాద్ భగత్సింగ్ చిత్రాలతో పాటు విజయ్ దేవరకొండ, నితిన్ సినిమాల్లో శ్రీలీల నాయికగా నటిస్తున్నది.