Namrata | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు – నమ్రత శిరోద్కర్ జంట గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత అందమైన, ఆదర్శప్రాయమైన దంపతులలో ఈ జంట ఎప్పుడూ ముందువరుసలో ఉంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ ఇద్దరూ ఇప్పుడు తమ వైవాహిక జీవితంలో 21 ఏళ్ల మైలురాయిని చేరుకున్నారు. ఈ రోజు (ఫిబ్రవరి 10) వారి పెళ్లి రోజు కావడంతో సోషల్ మీడియాలో అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది.ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని నమ్రత శిరోద్కర్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక అందమైన ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటో ఫ్లైట్ జర్నీలో తీసుకున్న త్రోబ్యాక్ క్లిక్గా కనిపిస్తోంది.
ఫోటోలో మహేష్ బాబు హ్యాండ్సమ్ లుక్తో మెరిసిపోతుండగా, ఆయన పక్కన కూర్చున్న నమ్రత చిరునవ్వుతో కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ ఫోటోకు నమ్రత ఇచ్చిన క్యాప్షన్ మరింత హృదయాన్ని తాకుతోంది. Still choosing you everyday… Happy 21 MB అంటూ ప్రతి రోజూ తన భర్తనే ఎంచుకుంటానని, 21 ఏళ్ల తర్వాత కూడా తమ ప్రేమ కొత్తదానిలానే ఉందని ఆమె భావోద్వేగంగా వ్యక్తపరిచారు. ఈ ఒక్క వాక్యం వారి బంధం ఎంత బలంగా ఉందో చెప్పేస్తోంది. మహేష్ బాబు – నమ్రత ప్రేమకథ ‘వంశీ’ సినిమా షూటింగ్ సమయంలో ప్రారంభమైంది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారి, కుటుంబ సభ్యుల అనుమతితో 2005 ఫిబ్రవరి 10న వీరు వివాహ బంధంలో అడుగుపెట్టారు. ఈ జంటకు గౌతమ్, సితార అనే ఇద్దరు సంతానం ఉన్నారు. నమ్రత సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, మహేష్ బాబు కెరీర్ నిర్ణయాలు, కుటుంబ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ప్రస్తుతం నమ్రత షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు “పర్ఫెక్ట్ కపుల్”, “గోల్స్” అంటూ కామెంట్లు పెడుతున్నారు. 21 ఏళ్ల తర్వాత కూడా ప్రేమ, పరస్పర గౌరవంతో ముందుకు సాగుతున్న ఈ జంట మరెన్నో సంవత్సరాలు ఇలాగే సంతోషంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.