తేజ సజ్జా కథానాయకుడిగా ప్రశాంత్వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ చిత్రం ఇటీవలే విడుదలై చక్కటి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. రెండో వారాంతంలో ఈ సినిమా 200కోట్ల వసూళ్ల మైలురాయిని చేరుకుందని చిత్ర బృందం ప్రకటించింది. తొలి భాగం ముగింపులోనే ఈ సినిమా సీక్వెల్ ‘జై హనుమాన్’ గురించి హింట్ ఇచ్చారు దర్శకుడు ప్రశాంత్వర్మ. తాజాగా ‘జై హనుమాన్’కు స్క్రిప్ట్ సిద్ధమైందని ఆయన తెలిపారు.
అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హైదరాబాద్లోని ఓ హనుమాన్ ఆలయంలో నిర్వహించిన యాగంలో పాల్గొని సీక్వెల్ స్క్రిప్ట్ను హనుమంతుడి విగ్రహం ముందు ఉంచారు. ప్రీ ప్రొడక్షన్ ప్రారంభించడానికి ఇంతకంటే మంచి సందర్భం తనకు లభించదని అన్నారు. సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని ప్రశాంత్ వర్మ తెలిపారు. కాగా ‘హను-మాన్’ సక్సెస్ నేపథ్యంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘జై హనుమాన్’ చిత్రంలో ఆంజనేయుడి పాత్రలో ఓ స్టార్ హీరో నటిస్తాడని, ఈ సినిమాను 2025లో విడుదల చేస్తామని ప్రశాంత్వర్మ పేర్కొన్నారు.