బుల్లితెరతో పాటు వెండితెరపై రచ్చ చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత కొద్ది రోజులుగా ఎవరు మిలో కోటీశ్వరులు అనే షోకి హోస్ట్గా ఉన్న విషయం తెలిసిందే. ఈ షోకి మహేష్ ఎపిసోడ్తో ముగింపు పడినట్టు తెలుస్తుంది. ఆదివారం రోజు ఎన్టీఆర్ షోలో మహేష్ సందడి చేయగా, ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. హాట్ సీట్ లో కూర్చున్న మహేష్ బాబు సైతం ఎన్టీఆర్ ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పారు.
ఒకరినొకరు టీజ్ చేసుకోవడమే కాకుండా సినిమాలు, వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. మహేష్ తన కూతురి గురించి చెబుతూ తనతో బాండింగ్ రోజు రోజుకు పెరుగుతుంది. సితారతో తండ్రిగా ప్రతి క్షణం ఆనందిస్తా అని అన్నాడు మహేష్. అయితే ఇందుకు ఎన్టీఆర్ స్పందిస్తూ.. కూతుళ్లు ఉన్నవాళ్లను చూస్తే తనకు ఈర్ష్యగా అనిపిస్తుందని వెల్లడించారు. తనకు ఇద్దరూ మగపిల్లలు కావడంతో కూతురు లేకపోవడం కాస్త వెలితిగా అన్పిస్తుందని జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడు.
ఓ ప్రశ్నలో భాగంగా మహాభారతంలో ఏ పాత్ర అంటే మీకిష్టమని, ఏ పాత్రని చేయాలనుకుంటున్నారని మహేష్ని.. ఎన్టీఆర్ ప్రశ్నించగా, అందులో అన్ని ముఖ్యమైన పాత్రలే అని, ఇప్పుడు దాన్ని తీయడం మామూలు విషయం కాదని తన సమాధానం దాటవేసే ప్రయత్నం చేశాడు. అయితే మీకు కృష్ణుడి వేషం బాగా సూట్ అవుతుందని ఎన్టీఆర్ అనగా, చిన్న స్మైల్ ఇచ్చాడు మహేష్.
త్వరలో రాజమౌళితో సినిమా చేస్తున్నారుగా ఇక అన్ని ఆటలు ఆడిపిస్తారని తెలిపారు ఎన్టీఆర్. అన్ని ఆటలు సెట్లో చూపిస్తారని, ఆయన మామూలోడు కాదని స్వీట్గా హెచ్చరించాడు ఎన్టీఆర్.