వాణీదేవి గెలుపుతో టీఆర్ఎస్ శ్రేణుల సంబురాలు
పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో కదం తొక్కిన ఉమ్మడి జిల్లా నేతలు
పాలమూరు జిల్లాకు ప్రచార ఇన్చార్జిగా వ్యవహరించిన మంత్రి ప్రశాంత్రెడ్డి
నిజామాబాద్, మార్చి 20, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : హైదరాబాద్ -రంగారెడ్డి -మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవి ఘనవిజయం సాధించడంతో ఉమ్మడి జిల్లాలో సంబురాలు మొదలయ్యాయి. ఆమె గెలుపు కోసం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన టీఆర్ఎస్ ముఖ్య నాయకులు ప్రచారం నిర్వహించారు. మహబూబ్నగర్ జిల్లాకు రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఇన్చార్జిగా వ్యవహరించారు. జిల్లా నేతల శ్రమ ఫలించడంతో టీఆర్ఎస్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలోని పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో బీజేపీ సిట్టింగ్ అభ్యర్థిపై టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ ఎన్నికల్లో నాలుగు రోజుల పాటు సాగిన ఓట్ల లెక్కింపుల్లో చివరికి గులాబీ పార్టీనే విజయం వరించింది. తొలి ప్రాధాన్యత ఓటు నుంచి స్పష్టమైన మెజార్టీతో దూసుకుపోయిన టీఆర్ఎస్ పార్టీకి రెండో ప్రాధాన్యత ఓట్లలోనూ మెజార్టీ దక్కడంతో విజయం ఖాయమైంది. పీవీ తనయ వాణిదేవి గెలుపుతో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలోని పట్టభద్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విద్యావేత్తను శాసనమండలికి పంపుతుండడంపై వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ సాధించిన ఘన విజయంతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోనూ గులాబీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. ఈ ఎన్నికలను సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకోగా… మహబూబ్నగర్ జిల్లాకు రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని ఇన్చార్జిగా నియమించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన టీఆర్ఎస్ ముఖ్య నాయకులు ప్రచారం నిర్వహించారు. వారి శ్రమ ఫలించడంతో ఆనందం వ్యక్తం అవుతున్నది.
సమన్వయమే వేముల సక్సెస్ మంత్ర..
హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి గెలుపులో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కృషి ఉన్నది. పాలమూరు జిల్లాకు ఇన్చార్జిగా వ్యవహరించిన ఆయన స్థానిక మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్తో సమన్వయం చేసుకుంటూ గెలుపే ధ్యేయంగా పని చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 14 నియోజకవర్గాలకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన టీఆర్ఎస్ ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఎక్కడా ఎలాంటి సమన్వయ లోపం లేకుండా పకడ్బందీగా పని చేశారు. లోపాలను గుర్తించడం, అప్పటికప్పుడు సరిదిద్దుకునే చర్యలతో మంత్రి వేముల తనదైన శైలిలో ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపునకు తీవ్రంగా శ్రమించారు. వనపర్తికి దాదాన్నగారి విఠల్రావు(నిజామాబాద్ జడ్పీ చైర్మన్), మహబూబ్నగర్కు ముజీబుద్దీన్(టీఆర్ఎస్ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు), నారాయణ్పేటకు దండు శేఖర్(నిజామాబాగ్ నగర టీఆర్ఎస్ నాయకుడు), మక్తల్కు పోచారం భాస్కర్రెడ్డి(డీసీసీబీ అధ్యక్షుడు), దేవరకొండకు డి.అంజిరెడ్డి(కామారెడ్డి జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు), నాగర్కర్నూల్కు సుదాం రవిచంద్ర(నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు), కల్వకుర్తికి సి.ప్రభాకర్ రెడ్డి(నుడా చైర్మన్), అచ్చపేటకు ఈగ గంగారెడ్డి(నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు), గద్వాల్కు సాంబార్ మోహన్(డీసీఎంఎస్ అధ్యక్షుడు), అలంపూర్కు గిర్దావార్ గంగారెడ్డి(డీసీసీబీ డైరెక్టర్), కొల్లాపూర్కు మార గంగారెడ్డి(మార్క్ఫెడ్ చైర్మన్), కొడంగల్కు పున్న రాజేశ్వర్(కామారెడ్డి గ్రంథాలయ సంస్థ చైర్మన్), షాద్నగర్కు దఫేదార్ రాజు(మాజీ జడ్పీ చైర్మన్), జడ్చర్లకు డి.భాస్కర్ యాదవ్(టీఆర్ఎస్ బీసీ సెల్)ను నియమించి నెల రోజుల పాటు ప్రచారం చేపట్టి పట్టభద్రుల ఓటర్లను ఆకట్టుకునేలా పని చేశారు.
బీజేపీ అబద్ధాలను బద్ధలు కొడుతూ…
ఉన్నది లేనట్లుగా.. లేనిది ఉన్నట్లుగా ప్రతి ఎన్నికల్లో ప్రచారం నిర్వహించే భారతీయ జనతా పార్టీ తీరును టీఆర్ఎస్ ఎండ గట్టింది. పట్టభద్రుల ఎన్నికల్లో వ్యూహాత్మకంగా చేసింది చెప్పుకుంటూ ఓటర్ల దగ్గరకు వెళ్లింది. అంతేకాకుండా అసత్యాలు మాట్లాడకుండా.. వాస్తవాలను ప్రజల్లోకి తీసుకు పోయింది. హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్నగర్ పట్టభద్రుల స్థానం భారతీయ జనతా పార్టీకి సిట్టింగ్ సీటు. ఈ స్థానాన్ని అధికార పార్టీ కొల్లగొట్టడంతో కమలం పార్టీ విలవిల్లాడుతున్నది. టీఆర్ఎస్ చేసిన, చేస్తున్న అభివృద్ధి పథకాలు, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను యావత్ తెలంగాణ సమాజం స్వాగతించడంతో పాటుగా ఎన్నికల్లో ఓటేసి మద్దతు కూడా తెలిపారు.