బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ల తర్వాత రాజమౌళి పంథా మార్చారు. మారిన ఇమేజ్నూ, మార్కెట్నూ దృష్టిలోపెట్టుకొని, స్థాయికి తగ్గట్టు అడుగులు వేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. మహేశ్బాబుతో ఆయన రూపొందించనున్న సినిమాకు సంబంధించి ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగులేస్తున్నారట దర్శకధీరుడు. ఈ సినిమా స్క్రిప్ట్వర్క్ ఇప్పటికే పూర్తికావచ్చిందని సమాచారం. ఇక అధికారికంగా ప్రకటించి, షూటింగ్ మొదలపెట్టడమే తరువాయి. దీనికోసం అమెరికాకు చెందిన ఓ క్యాస్టింగ్ ఏజెన్సీతో రాజమౌళి చర్చలు జరిపారన్నది తాజా వార్త. అలాగే ఇందులోని పాత్రధారుల విషయంలోనూ రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి.
కథానాయికగా ఇండోనేషియాకు చెందిన చెల్సియా ఎలిజబెత్ ఇస్తాన్ నటించనున్నట్టు విశ్వసనీయ సమాచారం. అలాగే ప్రముఖ హాలీవుడ్ నటుడు క్రిస్ హెమ్స్వర్త్ కీలక పాత్ర పోషించనున్నట్టు తెలిసింది. సాంకేతిక నిపుణుల విషయంలో కూడా గతానికి భిన్నంగా అడుగులేస్తున్నారు రాజమౌళి. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్గా పి.ఎస్.వినోద్, వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా ఆర్.సి.కమల్ కణ్ణన్, ప్రొడక్షన్ డిజైనర్గా మోహన్ బింగి, ఎడిటర్గా తంబిరాజు వ్యవహరించనున్నారని ఫిల్మ్ వర్గాల టాక్. ‘ఎస్ఎస్ఎంబీ29’ అనే వర్కింగ్ టైటిల్తో ఈ చిత్రం రూపొందనున్నట్టు గతంలో వార్తలు రాగా, దాన్ని తొలగించి ‘ఎస్ఎస్ఆర్ఎంబీ’ అనే వర్కింగ్ టైటిల్ని ఖరారు చేసినట్టు సినీవర్గాలు చెబుతున్నాయి. వ్యాపారపరంగా రాజమౌళీ ఇమేజ్ని కూడా దృష్టిలోపెట్టుకొని, మహేశ్, రాజమౌళి ఇద్దరి పేర్లు కలిసివచ్చేలా వర్కింగ్ టైటిల్లో మార్పులు చేశారట. ఇక ఈ సినిమాకు ‘మహారాజ్’ అనే పేరును రాజమౌళి పరిశీలిస్తున్నారని తెలిసింది. ఈ టైటిల్పై ఒక్కొక్కరి స్పందన ఒక్కోలావుంది. మరి ఇందులోని నిజానిజాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.