Rashmika Mandanna | ‘భీష్మ’ చిత్రంలో నితిన్-రష్మిక మందన్న జోడీ చక్కటి కెమిస్ట్రీతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ జంట మరోమారు వెండితెరపై సందడి చేయబోతున్నది. వీరిద్దరి కలయికలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న తాజా చిత్రం శుక్రవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మాతలు. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. నాయకానాయికలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి అగ్ర నటుడు చిరంజీవి క్లాప్నివ్వగా, దర్శకుడు బాబీ కెమెరా స్విఛాన్ చేశారు.
గోపీచంద్ మలినేని గౌరవ దర్శకత్వం వహించారు. ‘వినోదంతో పాటు అడ్వెంచరస్ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాం. కథ, కథనాలు నవ్యపంథాలో సాగుతాయి’ అని చిత్రబృందం పేర్కొంది. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, సంగీతం: జీవీ ప్రకాష్కుమార్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: హరి తుమ్మల, ఆర్ట్: రామ్ కుమార్, సీఈఓ: చెర్రీ, రచన-దర్శకత్వం: వెంకీ కుడుముల.