నటుడు నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల విడాకుల వ్యవహారం గురించి గత కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. భర్త చైతన్య జొన్నలగడ్డతో ఆమెకు మనస్పర్థలు తలెత్తాయని, కొన్నాళ్లుగా దంపతులిద్దరూ విడిగా ఉంటున్నారని ప్రచారం జరిగింది. ఈ వార్తలను ధృవపరుస్తూ మంగళవారం కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో నిహారిక విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. హిందూ వివాహ చట్టం ప్రకారం కోర్టును ఆశ్రయించింది.
పరస్పర అంగీకారంతోనే వీరిద్దరు కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. 2020 డిసెంబర్లో నిహారిక, జొన్నలగడ్డ చైతన్యల వివాహం జరిగింది. సంవత్సరం పాటు ఈ దంపతుల బంధం సవ్యంగానే సాగినట్లు తెలిసింది. కొన్ని నెలల క్రితం సోషల్మీడియా ఖాతాల నుంచి తాము కలిసి దిగిన ఫోటోలను వీరిరువురూ తొలగించడంతో విడాకుల వార్తలకు బలం చేకూరింది. పెళ్లయిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న నిహారిక ఇటీవలే ‘డెడ్ పిక్సెల్స్’ వెబ్సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చింది.