Nick Jonas |గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా భర్త, అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ భారతీయ సంస్కృతి, హిందూ మతంపై తనకున్న గౌరవాన్ని మరోసారి వెల్లడించాడు. పెళ్లి తర్వాత తన జీవితం ఎలా మారిందో, తన కూతురు మాల్తీ మేరీని ఎలాంటి విలువలతో పెంచుతున్నారో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. ఇటీవల ‘సచ్ సంగ్ షో’లో పాల్గొన్న నిక్ జోనస్ మాట్లాడుతూ.. ప్రియాంకను పెళ్లి చేసుకున్న తర్వాత భారతీయ సంప్రదాయాలు, కుటుంబ విలువలు తన జీవితంలో ఎంతో పెద్ద మార్పును తీసుకువచ్చాయని చెప్పాడు. నాకు ఎప్పుడూ పెద్ద ఉమ్మడి కుటుంబం కావాలని కోరిక ఉండేది. ప్రియాంకతో వివాహం తర్వాత అది నిజమైంది. మొదటిసారి ఇండియా వెళ్లినప్పుడు అక్కడి సంస్కృతి, కుటుంబ అనుబంధాలు చూసి ఆశ్చర్యపోయాను. ఇప్పుడు ఇండియానే నాకు మరో ఇల్లులా అనిపిస్తోంది అని నిక్ పేర్కొన్నాడు.
భారతీయ పండుగలపై కూడా నిక్ తన మక్కువను వెల్లడించాడు. ఇప్పుడు నా ఫేవరెట్ పండుగలన్నీ ఇండియన్ ఫెస్టివల్సే. హోలీ, దీపావళి వంటి వేడుకలు నా జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలు అని చెప్పాడు. హిందూ మతం గురించి మాట్లాడినప్పుడు నిక్ ఎమోషనల్ అయ్యాడు. హిందూయిజం ఎంతో లోతైనది, అందమైనది. ముఖ్యంగా ‘కర్మ’ సిద్ధాంతం నాకు బాగా నచ్చింది. మనం చేసే మంచి మనకే తిరిగి వస్తుంది అనే భావన గొప్పది. అలాగే ‘ధర్మం’ అనే కాన్సెప్ట్ కూడా ఎంతో అర్థవంతమైనది. అందుకే మా కూతురు మాల్తీ మేరీని కూడా హిందూ విలువలతోనే పెంచుతున్నాం. ఆమెకు వాటి అర్థం తెలియజేస్తున్నాం. బహుళ సంస్కృతులు, మతాలు కలిసిన కుటుంబం దొరకడం నా అదృష్టం అని నిక్ వివరించాడు.
ప్రియాంక – నిక్ జంట 2018లో హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు. అమెరికాలో నివసిస్తున్నప్పటికీ, ప్రతి సంవత్సరం దీపావళి, హోలీ, కర్వా చౌత్ వంటి పండుగలను ఘనంగా జరుపుకుంటూ భారతీయ సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. కెరీర్ పరంగా చూస్తే.. ఐదేళ్ల విరామం తర్వాత నిక్ జోనస్ తన సోలో ఆల్బమ్ ‘సండే బెస్ట్’ను విడుదల చేశాడు. ఫిబ్రవరి 10, 2026న ఈ ఆల్బమ్ డీలక్స్ వెర్షన్ కూడా రిలీజ్ చేసి, అందులో రెండు కొత్త ట్రాక్లను జోడించాడు. ఇక ప్రియాంక చోప్రా ప్రస్తుతం మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ ప్రాజెక్ట్తో బిజీగా ఉంది.