Pushpa 2 – Sandhya Theatre Stampede | హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు అందింది. ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా పుష్ప 2 ప్రీమియర్ షో ఏర్పాటు చేశారని దీని వలన సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిందని.. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషనర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక పిటిషనర్ ఇచ్చిన ఫిర్యాదును మానవ హక్కుల సంఘం విచారణకు స్వీకరించింది.
అసలు ఏం జరిగిందంటే.. బుధవారం రాత్రి పుష్ప 2 బెనిఫిట్ షోను చూసేందుకు హీరో అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని సంధ్య థియేటర్కు రాగా.. అతడిని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకున్నది. ఈ క్రమంలో వారిని నిలువరించేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో దిల్సుఖ్నగర్కు చెందిన రేవతి (39) అనే మహిళతో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ్ (9) కింద పడిపోయి జనాల కాళ్ల మధ్య నలిగిపోయారు. వారిద్దరూ తీవ్ర గాయాలతో సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే తల్లీకుమారులను పోలీసులు పక్కకు తీసుకెళ్లి సీపీఆర్ చేశారు. ఆ తర్వాత ఓ ప్రైవేట్ దవాఖాన తరలించగా.. చికిత్స పొందుతూ రేవతి మృతి చెందారు. శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉండటంతో నిమ్స్హాస్పిటల్కు తరలించగా.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.