అటు క్లాసూ ఇటు మాసూ అందరికీ నచ్చే హీరో అక్కినేని నాగార్జున. ప్రయోగాత్మక చిత్రాల్లో ఎక్కువగా నటించిన క్రెడిట్ నాగార్జునదే. అంతేకాదు, ఆయన పరిచయం చేసినంతమంది దర్శకులను ఇప్పుడున్న ఏ హీరో పరిచయం చేయలేదన్నది నిజం. ప్రస్తుతం ఆయన ‘నా సామిరంగ’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా బిన్నీ విజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. నాగ్ పరిచయం చేసిన దర్శకులందరూ దాదాపుగా సక్సెస్ కొట్టారు. ఆ వరుసలో ఈ బిన్నీ విజయ్ కూడా ఉంటాడని చిత్ర నిర్మాత శ్రీనివాస చిట్టూరి నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ‘నా సామిరంగ’ షూటింగ్ హైదరాబాద్లో శరవేగంగా జరుగుతున్నది. మలయాళం మెగా హిట్ ‘పరింజు మరియమ్ జోస్’ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిస్తున్నారని తెలిసింది. ఈ చిత్రానికి రచయిత ప్రసన్న కథ, కథనం, మాటలు అందిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాత భావిస్తున్నారు. అందుకే శరవేగంగా చిత్రీకరణ జరుగుతున్నది. ఇందులో నాగ్ పూర్తిస్థాయి మాస్ పాత్రలో నటిస్తున్నట్టు ఇప్పటికే విడుదలైన టీజర్ చెప్పేసింది.
నాగార్జున తన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నారని ఇప్పటికే పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. కథ రీత్యా కమర్షియల్ అంశాలే కాక, మనసుల్ని హత్తుకునే భావోద్వేగాలు కూడా ఇందులో మెండుగా ఉంటాయని తెలుస్తున్నది. ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి స్వరాలందిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.