సిద్దిపేట : మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ పొందేందుకు సిద్దిపేటలో మహిళా ప్రాంగణ భవన నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరైనట్లు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రిసోర్స్ సెంటర్లను తెలంగాణ మహిళా సాకార అభివృద్ధి సంస్థ నిర్వహిస్తుందని, అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కేంద్రాలు మహిళలు స్వయంగా తమ కాళ్లపై తాము నిలబడే విధంగా ఉపయోడపడుతుందన్నారు.
శిక్షణతో పాటు ఉపాధి మార్గాలు ఏర్పాటు చేస్తామన్నారు.
గ్రామీణ, పట్టణ నిరాశ్రయులైన వితంతువు, కౌమార దశలో ఉన్న విద్యావంతులైన నిరుద్యోగ మహిళలు వారి ఆర్థిక సాధికారిత కోసం శిక్షణ ఇస్తామన్నారు. తెలంగాణ మహిళా సహకార సంస్థ ద్వారా ఐసీడీఎస్ కార్యకర్తలు, కౌమార దశలో ఉన్న బాలికలు, అంగన్వాడీ ఉపాధ్యాయులు, మహిళలకు శిక్షణ ఉంటుందన్నారు. ఈ ప్రాంగణంలో ఎగ్జిబిషన్లు, వాణిజ్య ఉత్సవాలు, కొనుగోలు, అమ్మకందారుల సమావేశాలు, డిజైన్, ప్రదర్శన మొదలైన మార్కెట్ అవకాశాలకు ఏర్పాట్లు చేపడుతుందన్నారు. త్వరలోనే ప్రాంగణం పనులు మొదలవుతాయని మంత్రి తెలిపారు.