‘ఆహా’ ఓటీటీలో విడుదలై అందరి ప్రశంసలు అందుకున్న ‘ఓదెల రైల్వే స్టేషన్’ చిత్ర దర్శకుడు అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందనున్న నూతన చిత్రం గురువారం హైదరాబాద్లో ప్రారంభమైంది. పాపులర్ కథానాయిక కేథరిన్ థెరిసా హీరోయిన్గా, జార్జిరెడ్డి, వంగవీటి చిత్రాల కథానాయకుడు సందీప్ మాధవ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కేసీఆర్ ఫిలిమ్స్, శ్రీమహా విష్ణు మూవీస్ బ్యానర్లపై దావులూరి జగదీష్, పల్లి కేశవరావులు నిర్మిస్తున్నారు. హీరో, హీరోయిన్లలపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి దర్శకుడు సంపత్ నంది క్లాప్ నివ్వగా, నిర్మాత సి.కల్యాణ్ కెమెరా స్విఛాన్ చేశారు. ప్రసన్నకుమార్, జెమిని కిరణ్లు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ “ఓదెల రైల్వేస్టేషన్’ను చూసి నాకు ఈ అవకాశం ఇచ్చారు నిర్మాతలు. కథ వినగానే కేథరిన్, హీరో సందీప్లు ఎంతో ఆసక్తి చూపించారు. ‘జార్జిరెడ్డి’ తరువాత ఎన్నో కథలు విన్న సందీప్ ఈ కథ వినగానే ఓకే చేశాడు. నా ‘ఓదెల రైల్వేస్టేషన్’కు పదిరెట్లు అద్భుతంగా ఈ సినిమా ఉంటుంది’ అన్నారు. హీరోయిన్ కేథరిన్ మాట్లాడుతూ ‘కథ వినగానే ఎంతో నచ్చింది.
స్క్రీన్ప్లే బేస్డ్ సినిమా ఇది. సరికొత్త యాక్షన్ థ్రిల్లర్. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చే చిత్రమిది’ అన్నారు. కథానాయకుడు సందీప్ మాట్లాడుతూ ‘ జార్జిరెడ్డి తరువాత చాలా కథలు విన్నాను. కానీ ఈ కథ వినగానే ఎంతో బాగా నచ్చింది. ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా వుంటుంది. సినిమాలో వుండే ట్విస్ట్లు ఎవరూ ఊహించలేరు. చాలా కాలంగా పోలీస్ఆఫీసర్ పాత్రలో నటించాలని మంచి కథ కోసం ఎదురుచూస్తున్నాను. ఈ సినిమాలో అలాంటి పాత్ర దొరికింది. హీరోయిన్ కేథరిన్ పాత్రను కూడా దర్శకుడు ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని రీతిలో డిజైన్ చేశాడు. సినిమాకు మంచి టీమ్ కుదిరింది’ అన్నారు. చిత్ర సమర్పకుడు సోమ విజయప్రకాష్ మాట్లాడుతూ ‘ఇంతవరకు నేను వినని సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. చివరి వరకు సినిమాలో ఉండే ట్విస్ట్లు ఎవరూ ఊహించలేరు. అందరి ఊహలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ ఖర్చుతో ఈ సినిమాను నిర్మిస్తున్నాం’ అన్నారు. నిర్మాతల్లో ఒకరైన పల్లి కేశవరావు మాట్లాడుతూ ‘కొంత విరామం తరువాత నిర్మాతగా ఈ సినిమా చేస్తున్నాను. మంచి టీమ్తో సినిమా చేస్తున్నాం. చిత్రీకరణ పూర్తయ్యే వరకు కంటిన్యూ షెడ్యూల్ ఉంటుంది’ అన్నారు.